హైదరాబాద్, వెలుగు: కృష్ణా నీటి వివాదాలపై ఇప్పటి వరకు 70 లెటర్లు రాశామని, వాటిపై కనీస స్పందన రాలేదని కేఆర్ఎంబీపై తెలంగాణ అసహనం వ్యక్తం చేసింది. బచావత్ ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ -1) కేటాయింపులకు అనుగుణంగా నీటి పంపకాలు సహా అనేక అంశాలను తాము లేవనెత్తామని, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్లోని సెక్షన్ 85లోని (8)(ఏ) ప్రకారం బచావత్ అవార్డును ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కేఆర్ఎంబీపై ఉందని గుర్తు చేసింది. ఈ మేరకు ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ శనివారం కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్కు లెటర్ రాశారు. బచావత్ అవార్డులోని ఏడో క్లాజ్ ప్రకారం తాగు, గృహ అవసరాలకు కేటాయించిన నీటిలో 20 శాతమే వినియోగం కింద లెక్కించాలని పలుమార్లు లేఖలు రాసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
ఒక వాటర్ ఇయర్లో వాడుకోలేకపోయిన నీటిని క్యారీ ఓవర్ చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేశామని, ఇప్పటికైనా ఈ నిబంధన అమలుకు ప్రయత్నించాలని కోరారు. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీకి ఎన్ బ్లాక్(గంపగుత్త)గా కృష్ణా నీటిని కేటాయించిందని, కొత్త ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు తేల్చేవరకు రెండు రాష్ట్రాలకు చెరిసగం నీటిని కేటాయించాలని విజ్ఞప్తి చేసినా, పాత అగ్రిమెంట్ ప్రకారమే పంపకాలు చేస్తున్నారన్నారు. తాము లేవనెత్తిన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపించాలని ఈఎన్సీ విజ్ఞప్తి చేశారు.