సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట వద్ద నిర్మించిన ఆధునిక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ప్రారంభం తెలంగాణ వ్యవసాయ రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవబోతోంది. సుమారు రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు కొత్త ఊపును ఇవ్వనుంది. మార్చి 22న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఈ ఫ్యాక్టరీ ప్రారంభం కానుంది.
అదే రోజున మరో ముఖ్యమైన కార్యక్రమంగా రాష్ట్ర రైతులకు రైతు భరోసా నిధుల విడుదల కూడా జరగనుంది. ఈ రెండు కార్యక్రమాలు ఒకే వేదికపై జరగడం తెలంగాణ రైతాంగానికి ద్విగుణ శుభవార్తగా మారింది.నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ..
రైతుకు కొత్త ఆదాయం
రైతులకు దీర్ఘకాలిక ఆదాయం కల్పించే పంటగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆయిల్ఫీల్డ్ ఆధ్వర్యంలో నర్మెట్టలో అత్యాధునిక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మించారు. సుమారు 62 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ ఆధునిక సాంకేతికతతో రూపొందించారు.
ప్రారంభంలో గంటకు 30 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పనిచేసే ఈ మిల్లు భవిష్యత్తులో 120 మెట్రిక్ టన్నుల వరకు విస్తరించేలా
రూపకల్పన చేశారు. ఈ యూనిట్లో 4 మెగావాట్ల క్యాప్టివ్ పవర్ ప్లాంట్, పర్యావరణ హిత సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. దీని వల్ల ఉత్పత్తి ప్రక్రియలో ఏర్పడే వ్యర్థాలను సమర్థంగా వినియోగించే అవకాశం ఉంటుంది.
మంత్రి తుమ్మల పర్యవేక్షణ, జంగా కృషి
ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తికావడంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. ఆయన తరచుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనుల పురోగతిని సమీక్షించారు. అదే విధంగా జంగా రాఘవరెడ్డి నాయకత్వంలో ఆయిల్ ఫెడ్ అధికారులు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని రికార్డు సమయంలో పూర్తి చేశారు. రైతులతో మమేకమై ఆయిల్ పామ్ సాగుపై అవగాహన పెంచడంలో కూడా ఆయిల్ ఫెడ్ ముఖ్య పాత్ర పోషిస్తోంది.
రైతు మేళా
ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా మార్చి 20 నుంచి 22 వరకు మూడు రోజులపాటు రైతు మేళా నిర్వహించనున్నారు. ఇందులో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రభుత్వ పథకాలు, ఆయిల్ పామ్ సాగులోని మెలకువలపై రైతులకు ప్రత్యక్ష అవగాహన కల్పించనున్నారు.
రైతు భరోసా నిధులు..అన్నదాతకు ఆర్థిక బలం
రైతులకు తక్షణ ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. మొదటి విడతగా మార్చి 22న నర్మెట్టలో జరిగే కార్యక్రమంలో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,590 కోట్లు నేరుగా జమ చేయనున్నారు. అనంతరం మరో 20 రోజుల తర్వాత రూ.2,650 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా మిగిలిన రైతులకు కూడా నిధులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి సుమారు రూ.9,000 కోట్లు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
కొత్త దిశ...
నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు కొత్త దిశను చూపనుంది. అదే సమయంలో రైతు భరోసా నిధుల విడుదల రైతులకు తక్షణ ఆర్థిక ఊరటనిస్తుంది. ఈ రెండు కార్య క్రమాలు కలిసి తెలంగాణ రైతాంగానికి కొత్త ఆశలను నింపుతున్నాయి. ప్రభుత్వ సంకల్పం, అధికారుల కృషి, రైతుల భాగస్వామ్యం కలిస్తే తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు మరింత విస్తరించి రైతు ఆర్థిక స్థితి బలోపేతం కావడం ఖాయం.
- బండి దుర్గా ప్రసాద్,
తెలంగాణ ఆయిల్ ఫెడ్ లైజనింగ్ ఆఫీసర్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీopenpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
