ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీస్కోలే

ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీస్కోలే
  •  ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీస్కోలే
  • వీఆర్వోలకు నో జాబ్ చార్ట్  
  • సెర్ప్, మెప్మా సిబ్బందికి జీతాలూ పెంచలే 
  • బడ్జెట్​తో లింకు ఉన్నందుకే నాన్చుతున్న సర్కార్   

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ సాక్షాత్తూ అసెంబ్లీలో ప్రకటించిన హామీలు సైతం అమలుకు నోచుకోవడంలేదు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా అతీగతీ లేదు. వీఆర్ఏలకు లష్కర్ పోస్టులు, పేస్కేల్ అమలు చేయడం లేదు.  ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటామని ప్రకటించి మూడు నెలలు కావొస్తున్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. వీఆర్వో పోస్టులను రద్దు చేసి రెండేళ్లు కావస్తున్నా.. వారికి అధికారికంగా ఇంకా బాధ్యతలు అప్పగించలేదు. దాదాపు 6 వేల మంది వీఆర్వోలు జాబ్ చార్ట్ లేకుండా ఉన్నారు. సెర్ప్, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల‌‌‌‌తో స‌‌‌‌మానంగా వేత‌‌‌‌నాలు కూడా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇలా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి, వివిధ పనులు చేయాల్సిన దాదాపు 35 వేల మంది ఉద్యోగులపై రాష్ట్ర సర్కార్ నాన్చుడు ధోరణిని చూపుతోంది. అయితే, వీటన్నింటి అమలుకు బడ్జెట్​తో లింక్ ఉండటం వల్లే  సర్కార్ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.  

వీఆర్ఏలకు పేస్కేల్ ముచ్చట్నేలేదు 
వీఆర్ఏలను ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో లష్కర్‌‌‌‌‌‌‌‌లుగా నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌ వచ్చేలోపు లష్కర్‌‌‌‌‌‌‌‌ల నియామకంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ప్రతిపాదనలు కూడా పంపింది. ఈ ఫైల్​పై మాత్రం సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలో 22 వేల మంది వీఆర్ఏలు ఉండగా, వీరికి పేస్కేల్ అమలు కూడా ఆశగానే మిగిలిపోయింది. వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తామని, పేస్కేల్ వర్తింపజేస్తామని 2017 ఫిబ్రరి 24 ప్రగతిభవన్ లోనే సీఎం హామీ ఇచ్చారు. కానీ పేస్కేల్ ఇవ్వకుండా రూ. 6,500 వేతనాన్ని రూ. 10,500కు పెంచి చేతులు దులుపుకొన్నారు. వీరికి పేస్కేల్ అమలుచేస్తే రూ. 250 కోట్ల భారం పడుతుందని సర్కార్ అంచనా వేసింది. పీఆర్సీ ప్రకారం 30% వేతన పెంపు కూడా వర్తింపజేస్తామని చెప్పింది. కానీ ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీస్కోలేదు. 

వీఆర్వోలకు జాబ్ చార్ట్ ఎప్పుడు? 
వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి రెండేండ్లు కావస్తోంది. ఇంతవరకూ వారికి ఒక జాబ్​చార్ట్ లేదు. ఇతర డిపార్ట్​మెంట్లకు జూనియర్ అసిస్టెంట్లుగా బదిలీ చేస్తామన్నా.. ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదు. వీరు రెవెన్యూ డిపార్ట్ మెంట్లోనే సర్​ప్లస్​ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. ప్రతినెలా జీతాలు తీసుకుంటున్నారే తప్ప.. వీరికంటూ ఒక కచ్చితమైన పనిని ప్రభుత్వం ఇవ్వలేదు. వీరిని ఎమ్మార్వో ఆఫీసుల్లోనే వివిధ పనులకు వాడుకుంటున్నారు. ప్రభుత్వం నాన్చుడు ధోరణితో దాదాపు 5,600 మంది వీఆర్వోలు ఆందోళన చెందుతున్నారు.   

ఫీల్డ్ అసిస్టెంట్లను ఎప్పుడు తీస్కుంటరు? 
రాష్ట్ర ప్రభుత్వ సర్య్కులర్​కు వ్యతిరేకంగా సమ్మె చేశారన్న కారణంతో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను 2019లో సర్కార్ సస్పెండ్ చేసింది.​ అప్పటి నుంచి తమను విధుల్లోకి తీసుకోవాలని వారు ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల వరకూ అందరికీ మొరపెట్టుకున్నారు. ధర్నాలు చేసినా.. రెండేండ్లపాటు సర్కారు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి తీసుకుంటామని మార్చిలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి కదలికా లేదు. రాష్ట్రవ్యాప్తంగా 7,651 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పని చేసేవారు. ఇప్పుడు వాళ్ల బాధ్యతలన్నీ పంచాయతీ సెక్రటరీలకే అప్పగించడంతో సెక్రటరీలు పనిభారంతో కుంగిపోతున్నారు.