- వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.900 కోట్లివ్వండి
- లోకల్ బాడీస్కు రూ.817 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను రిలీజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి హరీశ్రావు కోరారు. ఏపీ విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో రెండేండ్ల బకాయిలు రూ.900 కోట్లు విడుదల చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ గ్రాంట్ను ఐదేళ్లపాటు పొడిగించాలని కోరారు. శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు లెటర్ రాశారు.
గతంలో రాసిన లేఖలు, అందులో పేర్కొన్న అంశాలను మరోసారి గుర్తు చేశారు. ‘‘నీతిఆయోగ్ సూచించిన మేరకు రూ.24,205 కోట్లు రాష్ట్రానికి విడుదల చేయాలి. లోకల్ బాడీస్కు రూ.817.61 కోట్లు ఇవ్వాలన్న 14వ ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం తిరస్కరించింది. రాష్ట్రం అన్ని షరతులను పూర్తి చేసినా.. నిర్దిష్ట కారణం లేకుండా ఈ గ్రాంట్లను ఇవ్వడం లేదు. వీలైనంత త్వరగా వీటిని రిలీజ్ చేయాలి” అని కోరారు. 2019–20తో పోల్చితే 2020–21లో రాష్ట్రానికి పన్నుల్లో వాటా తగ్గుతున్నదని చెప్పారు. తెలంగాణకు రూ.723 కోట్ల ప్రత్యేక గ్రాంట్ విడుదల చేయాలని 15వ ఆర్థిక సంఘం సూచించిందని తెలిపారు. ఆర్థిక సంఘం సిఫార్సులను గతంలో ఎప్పుడూ రిజెక్ట్ చేయలేదని, ఇప్పుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా వాటిని ఇవ్వాలని కోరారు.