30,453 పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం

30,453 పోస్టులకు ఆర్థిక శాఖ  ఆమోదం

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ఎక్సైజ్ , క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర మంత్రులతో పాటు సీఎస్ సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆయా శాఖల  అధికారులతో పలు దఫాలుగా చర్చించిన అనంతరం జీవోలు జారీ చేశారు. తాజా ఉత్తర్వుల మేరకు హోం శాఖ, వైద్య ఆరోగ్య, జైళ్లు, రవాణ శాఖ, గ్రూప్ 1 పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం లభించింది.  

రాష్ట్రంలో త్వరలోనే 80,039 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్ష ప్రకటించారు. ఇందులో భాగంగా తొలి విడతలో 30,453 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇతర శాఖల్లోని ఖాళీలపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆయా శాఖల మంత్రులు, అధికారులతో చర్చించి అనుమతులు ఇవ్వనున్నారు. ఉద్యోగాల భర్తీ జీవోలతో పాటు టెట్ నిర్వాహణకు ప్రభుత్వం అనుమతించింది. ఇతరశాఖల్లోని ఖాళీలపై త్వరలోనే ఆర్థికశాఖ అధికారులతో చర్చించి మిగతా ఉద్యోగాలకు కూడా అనుమతులు ఇస్తామని తెలిపింది.

ముందు అనుకున్నట్లుగా బోర్డుల ద్వారానే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. TSPSC ద్వారా 503 గ్రూప్-1 పోస్టులు, పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా 16వేల 587 ఖాళీలు భర్తీ చేయనుంది. హెల్త్ డిపార్ట్ మెంట్ రిక్రూట్ మెంట్ బోర్డు నుంచి 10వేల పోస్టులు, TSPSC ద్వారా హెల్త్ డిపార్ట్ మెంట్ లో 2వేల 662 ఖాళీలను,  డీఎస్సీ బోర్డు ద్వారా 45 పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.