హైదరాబాద్, వెలుగు : తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ( టీజీవో )కు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జీఏడీ సెక్రటరీ నిర్మల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై టీజీవో జనరల్ సెక్రటరీ ఏలూరి శ్రీనివాసరావు, నేతలు శ్యామ్, సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. గురువారం సెక్రటేరియెట్ మీడియా పాయింట్లో ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ పదేళ్లుగా టీజీవో ఎన్నికలు జరపలేదని తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ మంత్రి తనకు అనుకూలంగా ఉన్న కొంత మందిని పదవుల్లో నియమించారని, బైలాస్ కు వ్యతిరేకంగా అసోసియేషన్ కార్యకలాపాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు.