తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా

తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా

తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ భారీ జరిమానా విధించింది. వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలు, కోర్టు తీర్పులను అమలు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ 3 వేల 800 కోట్ల జరిమానా విధించింది. దీనిని ప్రత్యేక అకౌంట్లో జమచేయాలని తెలంగాణ సీఎస్ను ఆదేశించింది. వ్యర్థాల నిర్వహణకు చర్యలు చేపట్టి.. పురోగతి చెప్పాలని ఆదేశించింది. పర్యావరణ సురక్షా స్వచ్ఛంద సంస్థ పిటిషన్ పై విచారించిన ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

1996లో మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య, వ్యర్థాల నిర్వహణ సరిగా లేదని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు 2014లో ఎన్జీటీకి బదిలీ చేసింది. 351 నదీ పరీవాహక ప్రాంతాలు, 124 నగరాల్లో గాలి కాలుష్య నివారణపై మరో పిటిషన్ దాఖలైంది. 100 కాలుష్య కారక పారిశ్రామిక ప్రాంతాలపై చర్యలు తీసుకోవాలని, అక్రమ ఇసుక, మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంద సంస్థ పిటిషన్  వేసింది. అయితే రెండు విషయాలను మాత్రమే ప్రస్తుతం విచారణకు స్వీకరించింది ఎన్జీటీ. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్.. సుప్రీం ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది. ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నుంచి వివరణ కోరింది. తెలంగాణ సీఎస్ను విచారించిన హరిత ట్రిబ్యునల్.. సీఎస్ ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అందుకు అనుగుణంగా జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.