
- సాగర్ బుద్ధవనంలో రూ.16 కోట్లు, నిజాంసాగర్ వద్ద రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు
- ధ్యాన, యోగా కేంద్రాలు, వెల్నెస్ రిట్రీట్, కాటేజీలు, స్పా సెంటర్ల ఏర్పాటు
- దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రణాళికలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పర్యాటకానికి సరికొత్త సొబగులు అద్ది దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా ప్రముఖ జలాశయాలను పర్యాటక హబ్లుగా మార్చేందుకు అడుగులు వేస్తున్నది. జల సవ్వడుల మధ్య టూరిస్ట్లు మధురానుభూతి పొందేలా అభివృద్ధి పనులు చేపడుతున్నది. డ్యామ్ ల నుంచి జాలువారే జల దృశ్యాలను కనులారా వీక్షించేలా టూరిజం స్పాట్లుగా తీర్చిదిద్దుతున్నది. అక్కడికి వచ్చే టూరిస్ట్లకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. నాగర్కర్నూల్ జిల్లాలోని సోమశిల, అమరద్వీపం అభివృద్ధికి రూ.68 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అలాగే, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జలాశయం వద్ద రూ.10 కోట్లు, నాగార్జున సాగర్ బుద్ధవనంలో రూ.8 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నది. కేవలం జలాశయాలకే పరిమితం కాకుండా..కొత్త పర్యాటక ప్రదేశాలను గుర్తించి వాటిని టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేయడంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ఈ -ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్ ప్రక్రియను నిర్వహించింది. అలాగే, తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీటీడీసీ) ఆధ్వర్యంలో భువనగిరి కోట, అనంతగిరిలో గ్లాంపింగ్స్ను ఏర్పాటు చేస్తున్నది. హుస్సేన్ సాగర్ లాంటి ప్రాంతాలను అడ్వెంచర్స్పోర్ట్స్కు హాట్స్పాట్గా మార్చుతున్నది.
అమరగిరి ద్వీపంపై స్పెషల్ ఫోకస్
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిల జలాశయం వద్ద అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సోమశిల వెల్నెస్, స్పిరిచువల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్టుకు ‘స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ ఫర్ క్యాపిటల్ ఇన్వె్స్ట్మెంట్(సాస్కి) పథకం కింద రూ.68.10 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో పర్యావరణం, జల వనరులు, ఆలయాలు, వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ గేమ్స్ కు పుష్కలమైన వనరులు ఉన్న సోమశిల, అమరగిరి ద్వీపం, ఈగలపెంటను అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రెండు క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈగలపెంట అరైవల్ జోన్, ఈగలపెంట విహారయాత్ర, ఈగలపెంట రివర్ క్రూయిజ్, చెంచు ట్రైబల్ ఎక్స్పీరియన్స్ తోపాటు సోమశిలలో బోటింగ్ జెట్టిని ఏర్పాటు చేయనున్నారు.
అమరగిరి ద్వీపం వద్ద బోటింగ్ జెట్టి, కాటేజీలు, స్విమ్మింగ్ పూల్, కేఫ్టీరియా, స్పా, వెల్ నెస్ సెంటర్, ఇండోర్ అవుట్ డోర్ గేమ్స్, ఇతర సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆధ్యాత్మిక పర్యాటకులను ఆకర్షించేలా ధ్యాన కేంద్రాలు, యోగా రిట్రీట్లు, స్పా సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే, సోమశిల టూరిస్ట్ ప్లేస్కు దేశ, విదేశీ పర్యాటకులు వస్తుంటారు. వీకెండ్స్ లో అధికంగా టూరిస్ట్లు సందర్శిస్తారు. ఈ నేపథ్యంలో దీన్ని వెడ్డింగ్ డెస్టినేషన్ స్పాట్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. సోమశిల చుట్టూ కొండలతో ఆహ్లాదకర వాతావరణం కనువిందు చేస్తున్నది. ప్రకృతి రమణీయమైన ప్రదేశం కావడంతో వెడ్డింగ్ షూట్కు అనుకూలంగా ఉంటుంది. సోమశిల జలాల్లో బోటింగ్, శ్రీశైలం వరకు క్రూయిజ్ ప్రయాణం పర్యాటలకు ఆహ్లాదం అందిస్తున్నది. పర్యాటకులు సంగమేశ్వరాలయం, సోమేశ్వరాలయం, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం, భ్రమరాంబదేవి ఆలయాలను సందర్శించవచ్చు.
నిజాంసాగర్ డ్యామ్ వద్ద పర్యాటక పరవళ్లు
నిజాంసాగర్ డ్యామ్ వద్ద పర్యాటక పరవళ్లు కదంతొక్కనున్నాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామం వద్ద మంజీరానదిపై ఈ ప్రాజెక్టు ఉన్నది. హైదరాబాద్కు 145 కిలో మీటర్లు, జిల్లా కేంద్రానికి 72 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఎకో టూరిజం ప్రాజెక్టులో భాగంగా రూ.10 కోట్లతో మాడ్యులర్ ఇండ్లు (సెమీ రెడీమేడ్ హౌస్లు), 17 కాటేజీలు, ప్రధాన ప్రవేశ ద్వారం బ్లాక్ నిర్మాణం, డార్మెటరీ బ్లాక్, రిసెప్షన్ బ్లాక్, బోటింగ్, బంకెట్ హాల్, రెస్టారెంట్ బ్లాక్, చిల్డ్రన్ప్లేజోన్ (పిల్లలు ఆడుకునే స్థలం), యోగా డెక్, స్పా బ్లాక్, వాటర్ సంప్, వాటర్ ఫ్రంట్ ప్రొమెనేడ్ అండ్ జెట్టి ప్రాంతం, ల్యాండ్ స్కేపింగ్ ఇతర వినోద సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంగా ఈ స్పాట్ను తీర్చిదిద్దుతున్నారు. హర్ష కన్స్ట్రక్షన్ ఈ నిర్మాణాలు పనులు చేపట్టనున్నది.
టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఈ రంగం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తున్నది. కొత్త పర్యాటక ప్రాంతాలను గుర్తించి, పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపడుతున్నాం. తెలంగాణ పర్యాటక రంగాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషిచేస్తున్నాం. జలాశయాలను పర్యాటక హబ్లుగా తీర్చిదిద్దుతున్నాం. - క్రాంతి వల్లూరి , టూరిజం ఎండీ
బుద్ధవనం వద్ద ఆధునీకరణ పనులు
నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ వద్ద బుద్ధ వనం ఉంది. బౌద్ధ పర్యాటక కేంద్రంగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ధ్యాన మందిరాలు, మ్యూజియం, విపాసన ధ్యాన కేంద్రాలు, జాతక పార్క్ లాంటి నిర్మాణాలతో ఆసియా ఖండంలోనే అతిపెద్ద బౌద్ధ క్షేత్రంగా నిలిచింది. ఇక్కడికి దక్షిణాసియా దేశాల నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. బుద్ధవనంలో జైనమతానికి సంబంధించిన స్తూపాలు ఆధునీకరణ పనుల కోసం రూ. 8.78 కోట్లు కేటాయించారు. వాటర్ సప్లై, ఎలక్ట్రికల్ పనులు, అత్యాధునిక సీసీ కెమెరాల కోసం ఈ నిధులు వెచ్చించనున్నారు. ఈ పనుల నిర్మాణ బాధ్యతలు కూడా హర్ష కన్స్ట్రక్షన్కు అప్పగించారు. అలాగే, 16.06 కోట్లతో వివిధ రకాల డిజిటల్ పనులు చేపట్టేందుకు టెండర్లు ఆహ్వానించారు.