1640 మంది నర్సులు రోడ్డున పడ్డరు

1640 మంది నర్సులు రోడ్డున పడ్డరు

హైదరాబాద్, వెలుగు: కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలు ఫణంగాపెట్టి, వేల మంది ప్రాణాలను కాపాడిన నర్సులను ఉద్యోగంలో నుంచి తీసేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం రాత్రి సర్కార్ ఉత్తర్వులు అందుకున్న వివిధ దవాఖాన్ల సూపరింటెండెంట్లు, మంగళవారం డ్యూటీలకు వచ్చిన నర్సులను వెనక్కి పంపించారు. డీఎంఈ ఆర్డర్‌‌‌‌‌‌ మేరకు ఉద్యోగాల నుంచి తీసేస్తున్నామని సమాచారం ఇచ్చారు. ఇన్నాళ్లు తమ సేవలను వాడుకుని, ఇలా రాత్రికి రాత్రే ఉద్యోగం తీసేస్తే తాము ఏమైపోవాలంటూ నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. కోఠిలోని మెడికల్ ఎడ్యుకేషన్‌‌ ఆఫీసు వద్ద ఆందోళన చేపట్టారు.   డీఎంఈ ఆఫీసుకు వందల సంఖ్యలో నర్సులు చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. వందల మంది పోలీసులకు సేవ చేశామని, డైపర్లు మార్చామని తమను ఇలా అడ్డుకోవడమేంటని నర్సులు కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. పోలీసులు నర్సులను ఈడ్చిపడేశారు. 

ప్రాణాలకు తెగించి సేవలు

గతేడాది మార్చిలో ప్రభుత్వం1640 మంది నర్సులను అవుట్‌‌సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్ చేసింది. కరోనా ఫస్ట్ వేవ్‌‌లో వేల మంది రోగులకు వీరు సేవలు అందించారు. ఈ ఏడాది మార్చి నాటికే వీరి ఉద్యోగ కాలపరిమితి పూర్తయినప్పటికీ, సెకండ్ వేవ్ ఎఫెక్ట్​తో వీళ్లను అలాగే కొనసాగించారు. సెకండ్‌‌ వేవ్‌‌లోనూ ప్రాణాలకు తెగించి పనిచేశారు.  కరోనా తగ్గడంతో ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు.

రోడ్డున పడేస్తరా? 

ఈ ఏడాది మార్చి నాటికి మాది ఏడాది సర్వీస్ కంప్లీట్ అయింది. ఇంకో ఏడాది సర్వీస్ పొడిగిస్తున్నామని చెప్పారు. కరోనాతో మా కండ్ల ముందే ఎంతో మంది చనిపోతున్నా మేం మా సేవలు కొనసాగించాం. ప్రైవేట్ హాస్పిటల్స్‌‌లో నెలకు రూ.50 వేలు ఇస్తుంటే, ఇక్కడ రూ.25 వేలకే పనిచేశాం. మరో ఏడాది పొడిగిస్తమని చెప్పి, రాత్రికి రాత్రి జాబ్స్ తీసేస్తే ఎట్ల బతకాలి. ఇప్పుడు ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతయ్? సీఎం కేసీఆర్ గాంధీకి వచ్చినప్పుడు పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడేమో ఇట్ల చేస్తున్నారు. సీఎం స్పందించి, మా సర్వీస్ కొనసాగించాలి.
‑ అజయ్‌‌, స్టాఫ్ నర్స్‌‌, గాంధీ హాస్పిటల్

అనాలోచిత నిర్ణయం

అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులను అర్ధంతరంగా తొలగించడం కరెక్ట్​ కాదు. సీఎం కేసీఆర్ సర్కార్ అనాలోచిత చర్యల వల్ల వందలాది కుటుంబాలు  రోడ్డునపడాల్సిన పరిస్థితి దాపురించింది.  న్యాయం కోసం రోడ్డెక్కిన సిబ్బందిపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి అరెస్టు చేయడం దారుణం. కరోనా విపత్కాలంలో ప్రాణాలను ఫణంగా పెట్టి రాత్రింబవళ్లు రోగులకు సేవలందించిన నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి కేసీఆర్ ఇచ్చే నజరానా ఇదేనా? ఇప్పటికైనా సీఎం వెంటనే స్పందించి వారిని విధుల్లోకి తీసుకోవాలి. వారిపై  ఆధారపడిన కుటుంబాలను ఆదుకోవాలి.
  ‑ బండి సంజయ్, బీజేపీ స్టేట్​ చీఫ్​

రూల్ ప్రకారమే చేస్తున్నం

నర్సులు చేస్తున్న ఆరోపణలు సరికాదు. ఒక ఏడాది లేదా రెగ్యులర్ నర్సులు వచ్చే వరకే ఈ ఉద్యోగాలు ఉంటాయని వాళ్ల రిక్రూట్‌‌మెంట్ ఆర్డర్‌‌‌‌లోనే స్పష్టంగా ఉంది. ఇప్పుడు రెగ్యులర్ నర్సుల రిక్రూట్‌‌మెంట్ పూర్తవడంతో, టెంపరరీ వాళ్లను తీసేస్తున్నం. మొత్తం 1640 మందిని తీసేయడం లేదు. రెగ్యులర్ నర్సులు ఎంత మంది వచ్చారో, అంతే మందిని తీసేస్తున్నం. ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని మిగిలిన వాళ్లను కంటిన్యూ చేస్తాం. వాళ్లకు ఇష్టం ఉంటే ఉద్యోగాలు చేయొచ్చు, లేకుంటే వెళ్లిపోవచ్చు. ఇందులో బలవంతమేమీ లేదు. మా సూపరింటెండెంట్లు కూడా వాళ్లకు తెలియజేశారు.
‑ డాక్టర్ రమేశ్‌‌రెడ్డి, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్