
- కొత్త పథకానికి శ్రీకారం
- రెండు రోజుల్లో గైడ్లైన్స్ విడుదల చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
మెదక్, వెలుగు: రోడ్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు ఉన్న దారులను డెవలప్ చేయాలని, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లే రోడ్లను రెండు వరుసలుగా, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు వెళ్లే దారులను నాలుగు వరుసలుగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ యాన్యూటీ మోడల్(హ్యామ్) స్కీంకు శ్రీకారం చుట్టారు. దీని కింద ఆయా రోడ్లను నేషనల్ హైవే స్టాండర్డ్స్తో అభివృద్ధి చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలో మెదక్ జిల్లా పంచాయతీ రాజ్, రోడ్లు, భవనాల శాఖల అధికారులు సర్వే చేసి, ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ప్రాధాన్యతా క్రమంలో రోడ్లను ఎంపిక చేయనున్నారు.
పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో..
పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో 273 కిలోమీటర్ల పొడవు ఉన్న 66 రోడ్లను హ్యామ్ స్కీం కింద అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. వీటిలో మెదక్ అసెంబ్లీ నియోజక వర్గంలో 18 రోడ్లు (67.132 కిలోమీటర్లు), నర్సాపూర్ నియోజకవర్గంలో 25 (124.335 కిలోమీటర్లు), అందోల్ నియోజకవర్గంలో 15 (47.97 కిలో మీటర్లు), నారాయణఖేడ్ నియోజకవర్గంలో 5 (13.37 కిలోమీటర్లు), గజ్వేల్ నియోజకవర్గంలో 3 రోడ్లు (21.02 కిలోమీటర్లు) ఉన్నాయి. మెదక్ నియోజకవర్గంలో మెదక్ మండలం పాతూర్ రాయిన్పల్లి, బ్యాతోల్, గజ్వేల్ నియోజకవర్గంలో తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి, మల్కాపూర్దారులను ఈ పథకం కింద డెవలప్చేయనున్నారు.
ఆర్అండ్ బీ శాఖ పరిధిలో..
రోడ్లు భవనాల శాఖ పరిధిలో 116 కిలోమీటర్ల పొడవు ఉన్న 5 రోడ్లను ఈ స్కీం కింద ప్రతిపాదించారు. వీటిలో మెదక్ –చేగుంట, చేగుంట టౌన్ రోడ్, మంబోజిపల్లి– బొడ్మట్ పల్లి, పోతాం షెట్పల్లి – జోగిపేట, చిన్నశంకరంపేట– మాసాయిపేట దారులున్నాయి. రెండు రోజుల్లో ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ విడుదల చేయనుంది. ఆ తర్వాత ప్రతిపాదిత రోడ్ల అభివృద్ధికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోనున్నారు.