అవినీతి పోలీసులపై సర్కారు కొరడా..హోంశాఖ నుంచే ప్రక్షాళన స్టార్ట్!

అవినీతి పోలీసులపై సర్కారు కొరడా..హోంశాఖ నుంచే ప్రక్షాళన స్టార్ట్!
  • ఉన్నతాధికారులనూ వదలని ప్రభుత్వం
  • ఆదాయానికి మించి ఆస్తులున్న సీసీఎస్ ఏసీపీ అరెస్ట్
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో జైల్లో నలుగురు ఆఫీసర్లు
  • షకీల్ కుమారుడి కేసులో పంజాగుట్ట సీఐ సస్పెన్షన్
  • ఠాణా మొత్తం ట్రాన్స్ ఫర్ చేసి సరి కొత్త  రికార్డ్
  • సివిల్ పంచాయతీల్లో తలదూర్చినోళ్లనూ వదల్లే
  • కీసరలో రూ. 5 లక్షలు నొక్కేసిన వారిపైనా వేటు
  • పోలీసు శాఖలో హాట్ టాపిక్ గా కరెప్షన్ అంశం

హైదరాబాద్: పదేండ్లు వాళ్లు పాడిందే పాట.. చెప్పిందే వేదం.. వాళ్ల మాటే శిలాశాసనం.. అవినీతి, బంధు ప్రీతి అంతా ఇంతా కాదు.. కోట్లు కొల్లగొట్టారు.. కోట్లకు పడగలెత్తారు! అక్రమార్జనలో అనకొండలు.! సాధారణ ప్రజలంటే లెక్కేలేదు.. గత పాలకుల అడుగులొత్తుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వారిపై సర్కారు సీరియస్ గా దృష్టి సారించింది. పోలీసుల శాఖలో అవినీతిపై విచారణ ప్రారంభించడంతో కలుగులో ఉన్న ఎలుకలన్నీ బయటకు వస్తున్నాయ్. ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావును అరెస్టు చేయడం కలకలం రేపింది. రెండు రాష్ట్రాల్లో ఏసీబీ సోదాలు జరపడం చర్చనీయాంశంగా మారింది. అంతకు ముందు ఫోన్ల ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ ఇన్ స్పెక్టర్ గా పనిచేసిన ప్రణీత్ రావును అరెస్టు చేసిన విషయం తెలిసిందే అదే కేసులో పోలీసు అధికారులు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు అరెస్టయి జైల్లో  ఉన్నారు. ఎస్ ఐబీ మాజీ చీఫ్​ ప్రభాకర్ రావు కు రెడ్ కర్నార్ నోటీసులు జారీ కాబోతున్నాయి. ఈ కేసు ఓ వైపు సాగుతుండగానే మరో ఉమా మహేశ్వర్ రావు అక్రమాస్తులు చిట్టా బయటికి రావడం కలకలం రేపింది. ఇంత జరుగుతున్నా గత పాలకులు ఏం చేశారన్నది హాట్ టాపిక్ గా మారింది. 

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ కేసును తారుమారు చేసేందుకు యత్నించిన పంజాగుట్ట సీఐ దుర్గారావుపై సర్కారు సస్పెన్షన్ వేటు వేసింది. ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలించి సంచలన నిర్ణయం తీసుకున్నది. ఠాణా మొత్తాన్ని ట్రాన్స్ ఫర్ చేయడం కలకలం రేపింది. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులపై చిన్నపాటి ఆరోపణలు వచ్చినా వదలడం లేదు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు పోలీసులు ఓ వ్యక్తిని నిర్బంధించిన కేసులో ఇన్ స్పెక్టర్ వెంకటేశ్ పై వేటు పడింది. భార్యాభర్తల వివాదంలో తలదూర్చిన ఆర్జీఏఐ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసులపైనా వేటు పడంది. లోక్ సభ ఎన్నికల వేళ కీసరలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు రూ. 5 లక్షలు చిక్కడం వాటిని ఇద్దరు కానిస్టేబుళ్లు నొక్కేయడం బయటికి రావడంతో అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు శ్రీకాంత్ యాదవ్, కృష్ణలను సస్పెండ్ చేసింది ప్రభుత్వం.  పోలీసు శాఖను ప్రక్షాళన చేయడం ద్వారా రాష్ట్రంలోని అవినీతి అధికారు వెన్నులో వణుకు మొదలైంది.