
- గిరి రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా పథకం అమలుకు ప్రభుత్వం ఏర్పాట్లు
- జిల్లాల వారీగా ఐటీడీఏ ఆధ్వర్యంలో సమావేశాలు
- టెండర్ల ప్రక్రియ, సర్వే ఏర్పాట్లలో ఐటీడీఏ అధికారులు
- ఉమ్మడి జిల్లాకు తొలి విడతలో 2 వేల యూనిట్లు మంజూరు
ఆదిలాబాద్, వెలుగు: గిరిజన రైతులు సాగుచేసుకుంటున్న పోడు భూములను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా సౌరగిరి జల వికాసం పథకానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కలిసి నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పోడు భూముల్లో సాగునీరు, సౌర విద్యుత్, యాంత్రీకరణ వంటి పనులను చేపట్టేందుకు సిద్ధమైంది.
సమగ్ర భూమి అభివృద్ధి పనులతో పాటు సౌర విద్యుత్తో కూడిన సాగునీటి సదుపాయం కల్పించనున్నారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు లబ్ధి చేకూరనుంది. 2005 డిసెంబర్ వరకు పోడు వ్యవసాయం చేస్తూ హక్కు పత్రాలు కలిగి ఉన్న గిరిజన రైతులు ఇందుకు అర్హులు.
2.12 లక్షల ఎకరాల్లో పోడు సాగు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏండ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్న రైతులకు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. త్రీఫేజ్ కరెంట్ సౌకర్యం కల్పించడంలో అటవీ శాఖ అడ్డంకులతో బోర్లు వేసుకోలేని పరిస్థితి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సౌర గిరిజల వికాసం పథకం ద్వారా సౌర విద్యుత్ సదుపాయం కల్పించి సాగునీటి వనరులు ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి వ్యాప్తంగా 66 వేల మంది రైతులు 2.12 లక్షల ఎకరాల్లో పోడు భూములు సాగు చేసుకుంటున్నారు. ఇందులో అటవీ హక్కు పత్రాలున్న ప్రతి రైతు ఇందిర సౌర గిరిజల వికాస పథకానికి అర్హులు. ముందుగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పోడు భూములను అభివృద్ధి చేస్తారు. పోడు భూముల్లో భూగర్భ, నీటి వనరుల సర్వే చేపట్టి రైతులకు మేలు జరిగేలా చేతిబావులను తవ్విస్తారు. 5 హెచ్పీ, 7.5 హెచ్పీ సోలార్ పంపు సెట్లు, సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసి విద్యుత్ అందించి సాగునీటి సౌకర్యం కల్పించనున్నారు.
అలాగే విత్తనాలు, వ్యవసాయ యంత్రాలు, డ్రిప్, స్ప్రింక్లర్లు సబ్సిడీ ద్వారా అందించనున్నారు. ఒక రైతులకు రెండెకరాలకు పైగా ఉంటే ఒక యూనిట్ మంజూరు చేయనున్నారు. అదే రెండెకరాలకు తక్కువగా ఉంటే పక్కనున్న రైతులతో గ్రూపుగా ఏర్పడి యూనిట్లను మంజూరు చేయనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడతలో 2 వేల యూనిట్లు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నారు.
వచ్చే ఐదేండ్లలో అభివృద్ధి పనులు
పోడు భూముల్లో వచ్చే ఐదేండ్లలో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలో ఐటీడీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకం అమలులో కలెక్టర్, ఐటీడీఏ పీవోలు కన్వీనర్లుగా ఉండగా అటవీశాఖ, పంచాయతీ రాజ్, వ్యవసాయ, ఉద్యానవన శాఖ, భూగర్భ జల శాఖల అధికారులతో సమన్వయం చేసుకోనున్నారు. పథకం అమలుపై టెండర్ల ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలు సిద్ధం చేశారు.
ఏర్పాట్లు జరుగుతున్నాయి
ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని ఉమ్మడి జిల్లాలో అమలు చేసేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాం. త్వరలో నాలుగు జిల్లాల కలెక్టర్ల సమక్షంలో సమావేశాలు నిర్వహించనున్నాం. టెండర్ల ప్రక్రియకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేశాం. కలెక్టర్ సమావేశం తర్వాత పథకం అమలకు సంబంధించిన సర్వే చేస్తాం. ఖుష్బూ గుప్తా, ఐటీడీఏ పీవో, ఉట్నూర్