జులై రెండోవారంలో అసెంబ్లీ?

జులై రెండోవారంలో అసెంబ్లీ?
  • కేంద్ర బడ్జెట్​కు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ పెట్టేందుకు ఏర్పాట్లు 
  • విద్య, వ్యవసాయ కమిషన్లతోపాటు రైతు భరోసా, రైతు రుణమాఫీ, ధరణి, ఆర్‌ఓఆర్ చట్టాలపై చర్చలు

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది. వివిధ శాఖలతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు.. పూర్తిస్థాయి బడ్జెట్‌‌ ప్రవేశపెట్టేందుకు అధికారులను సమాయత్తం చేస్తున్నారు. అలాగే విద్య, వ్యవసాయ కమిషన్లతోపాటు రైతు భరోసా, రైతు రుణమాఫీ, ధరణి, ఆర్‌‌ఓఆర్ చట్టాలు తదితర అంశాలు ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. 

జులై రెండో వారం నుంచి అసెంబ్లీ సెషన్​ ప్రారంభించే చాన్స్​ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు.. రానున్న రోజుల్లో ప్రవేశపెట్టనున్న స్కీమ్స్​ అమలుకు నిధుల కేటాయింపు, తదితర అంశాలపై చర్చ జరగనుంది. రూ.2 లక్షల రైతు రుణమాఫీకి ఎంత ఖర్చవుతుంది? దానికి నిధుల సమీకరణ ఎలా చేయాలి? అనే అంశంపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పుడు అమలవుతున్న రైతుబంధు పథకంతో అనర్హులకు కూడా లబ్ధి చేకూరుతుందని భావిస్తున్న తెలంగాణ సర్కారు దాన్ని ప్రక్షాళన చేసే దిశలో ముందుకెళ్లాలని యోచిస్తోంది. అలాగే, సెక్రటేరియట్​ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు, తెలంగాణ చిహ్నంపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ వర్షాకాల సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌‌కు ఆమోదముద్ర వేయడంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

కేంద్ర బడ్జెట్​కు అనుగుణంగా రాష్ట్ర పద్దుకు తుదిమెరుగులు

రాష్ట్రంలో ఆగస్టు నుంచి మార్చి వరకు అవసరమైన నిధుల కేటాయింపు కోసం పూర్తిస్థాయి బడ్జెట్‌‌ అమల్లోకి రావాల్సి ఉంది. కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన ఎన్డీయే సర్కార్ జులైలో పార్లమెంట్‌‌ సమావేశాలు నిర్వహించి, రెండోవారంలో లేదంటే మూడోవారంలో పూర్తిస్థాయి పద్దును ప్రవేశ పెట్టనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌‌లో రాష్ట్రానికి కేటాయింపులు ఏ మేరకు ఉంటాయో చూసుకుని, వాటి ఆధారంగా ఇక్కడ తెలంగాణ సర్కారు పూర్తిస్థాయి పద్దుకు తుది మెరుగులు దిద్దనుంది. 

పార్లమెంట్​లో కేంద్ర బడ్జెట్ పెట్టిన రెండు, మూడురోజుల్లోనే రాష్ట్రంలోనూ బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. అంతకంటే ముందు అనేక అంశాలపై అసెంబ్లీలో చర్చ చేయనున్నారు. ధరణి పోర్టల్‌‌కు బదులుగా భూమాతను తెస్తామని చెబుతూ వస్తున్న సర్కార్, ఇదే అంశంపై అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. ఇప్పుడున్న ఆర్‌‌ఓఆర్ చట్టం సమర్థత కలిగినది కాదని అభిప్రాయపడుతున్న ప్రభుత్వం.. దానిని పూర్తి స్థాయిలో సవరించి భూచట్టాలన్నింటినీ ఒకే గొడుగు కింద వచ్చేలా ఒకటే చట్టాన్ని అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.