
- త్వరలో మరో 6 టెండర్లు ఫైనల్ చేయనున్న సీవోటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో ఐదు కొత్త ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణానికి టెండర్లు ఖరారయ్యాయి. ఇప్పటికే వికారాబాద్ జిల్లా కొడంగల్, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గాల్లో టెండర్లు ఖరారుకాగా.. తాజాగా హుస్నాబాద్, అందోల్, షాద్నగర్, వరంగల్ ఈస్ట్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో నిర్మించనున్న గురుకులాలకు కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ) టెండర్లను ఖరారు చేసింది. స్టేట్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఈడబ్ల్యూఐడీసీ) మొత్తం 11 నియోజకవర్గాల టెండర్ వివరాలను సీవోటీకి సమర్పించగా.. వీటిలో 5 టెండర్లు ఆమోదం పొందాయి. మిగిలిన 6 నియోజకవర్గాల టెండర్లను సీవోటీ వచ్చే వారం ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
హుస్నాబాద్ గురుకుల టెండర్ బీపీఆర్ ఇన్ఫ్రా కంపెనీకి, కొల్లాపూర్& వరంగల్ ఈస్ట్ గురుకుల టెండర్లు గౌరిశంకర్ ఇన్ఫ్రా బిల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు, అందోల్ ఇంటిగ్రేటెడ్ గురుకుల టెండర్ సాయి పావని కన్స్ట్రక్షన్స్& బీపీఆర్ ఇన్ఫ్రా కంపెనీ జాయింట్ వెంచర్కు, షాద్నగర్ గురుకుల టెండర్ కేఎంవీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్కు దక్కాయి. ఒక్కో క్యాంపస్ నిర్మాణ వ్యయాన్ని రూ. 145 కోట్లుగా టీజీఈడబ్ల్యూఐడీసీ నిర్ణయించింది.
పనులను ఏడాదిన్నరలోగా పూర్తి చేయాలని టెండర్ అగ్రిమెంట్లో స్పష్టం చేసింది. త్వరలో ఈ కంపెనీలతో కార్పొరేషన్ అగ్రిమెంట్లు కుదుర్చుకోనుంది. ఈ నెలలోనే సంబంధిత కంపెనీలు జాగను స్వాధీనం చేసుకొని నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.