జూన్ 21న వార్డులు, డివిజన్లు ఫైనల్

జూన్ 21న వార్డులు, డివిజన్లు ఫైనల్
  • నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్న ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ వార్డులు, డివిజన్ల విభజన ప్రక్రియ పూర్తయింది. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి వచ్చిన వివరాలను కలెక్టర్లు ఆమోదించి కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ)కు పంపారు. ఈ వివరాలను మున్సిపల్ శాఖ ప్రభుత్వానికి అందజేసింది. ఈ మేరకు శనివారం వార్డులు, డివిజన్లపై ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనున్నది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 158 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. 

ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న 27 మున్సిపాలిటీలను మినహాయిస్తే.. 10 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏడాది పాటు సమయం ఉంది. ఇక మిగిలిన 121 మున్సిపాలిటీల్లో మాత్రమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటిలో 18 మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. మరో 12 మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనంతో వార్డుల పునర్ విభజన చేయాల్సి వచ్చింది. ఇటీవల ప్రభుత్వం కొత్తగా మహబూబ్​నగర్, కొత్తగూడెం, మంచిర్యాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. కాగా, ఆగస్టులో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. కొన్ని నెలలుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతున్నది. అయితే, కుల గణన రీ సర్వే లెక్కలు ఇవ్వాలని ప్లానింగ్ డిపార్ట్​మెంట్​కు మున్సిపల్ శాఖ అధికారులు 4 సార్లు లేఖలు రాశారు. 

అయినప్పటికీ లెక్కలు ఇవ్వలేదని మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయడానికి ప్రభుత్వం చేపట్టిన కులగణన వివరాలను బీసీ డెడికేటెడ్ కమిషన్ కు మున్సిపల్ శాఖ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెక్కల ప్రకారం.. మున్సిపాలిటీల కౌన్సిలర్లు, చైర్మన్లు, కార్పొరేషన్ల డివిజన్లు, మేయర్ ల రిజర్వేషన్లను డెడికేటెడ్ కమిషన్ ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. కాగా, తొలి దశ కులగణన లెక్కలను ప్లానింగ్ డిపార్ట్​మెంట్ బీసీ డెడికేటెడ్ కమిషన్ కు అందించగా.. పంచాయతీరాజ్ రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఇప్పుడు మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉండగా.. ఇంత వరకు లెక్కలు రాలేవని అధికారులు చెప్తున్నారు.