
- 18 నెలల్లో చేసినట్టు ప్రభుత్వం వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. ఏడాదిన్నర పాలనలో రైతుల సంక్షేమం కోసం రూ.1.04 లక్షల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసినట్టు వెల్లడించింది. ఇంత తక్కువ సమయంలో ఇన్ని నిధులు ఖర్చు చేసిన రాష్ట్రం దేశంలో మరేదీ లేదని చెప్పింది. వరి సాగు, దిగుబడిలో రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా నిలిచిందని తెలిపింది.
తెలంగాణలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయని శుక్రవారం ప్రకటనలో పేర్కొంది. ఏడాదిన్నర పాలనలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల కోసం ఎన్ని నిధులు ఖర్చు చేసిందనేది గణాంకాలతో సహా వెల్లడించింది. రూ.2 లక్షల రుణమాఫీ కింద రూ.20,616 కోట్ల పంట రుణాలను మాఫీ చేసినట్టు తెలిపింది.
రైతు భరోసా కింద ఇప్పటి వరకు రూ.12,682 కోట్లు చెల్లించినట్టు చెప్పింది. రాష్ట్రంలోని 29 లక్షల పంప్సెట్లకు ఉచిత కరెంట్ కోసం విద్యుత్ సంస్థలకు రూ.16,691 కోట్ల సబ్సిడీ చెల్లించినట్టు పేర్కొంది. 2023-–24లో రూ.20,964 కోట్ల వడ్లు, 2024–25లో రూ.29,562 కోట్ల వడ్లు కొనుగోలు చేసినట్టు వివరించింది. సన్న వడ్లకు క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ చెల్లించినట్టు తెలిపింది. అకాల వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.260 కోట్లు పంట నష్ట పరిహారం అందించినట్టు చెప్పింది.
ఆయిల్ పామ్ రైతులను ప్రోత్సహించడంతో రైతులందరికీ డ్రిప్, స్ర్పింక్లర్ ఇరిగేషన్ పరికరాలను రాయితీ మీద అందిస్తున్నట్టు వెల్లడించింది. 2023 డిసెంబర్ నుంచి 40,265 మంది రైతులకు రూ.282 కోట్ల విలువైన పరికరాలను అందించినట్టు వివరించింది.