తెలంగాణ పాలనలో మరో కీలక ముందడుగు పడింది. ఇకపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు పూర్తిగా పేపర్ లెస్ గా జరగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశంలో ఈ మేరకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అధికారులు ఎవరూ లేకుండా కేవలం మంత్రులతో మాత్రమే సీఎం ప్రత్యేక భేటీ నిర్వహించారు.
ఈ డిజిటల్ కేబినెట్ విధానంలో భాగంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు.. సీఎంకు, డిప్యూటీ సీఎంకు, ఇతర మంత్రులకు ప్రత్యేకంగా రూపొందించిన టాబ్ లను అందజేశారు.
ఇక నుంచి కేబినెట్ ఎజెండా మొత్తం ఈ-బుక్ (e-Book) రూపంలోనే మంత్రుల ట్యాబ్స్లోకి చేరుతుంది. పేపర్ లెస్ గవర్నెన్స్ను లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఈ నూతన విధానంపై ఇప్పటికే పూర్తిస్థాయిలో కసరత్తు చేసింది.
నూతన డిజిటల్ కేబినెట్ పనితీరును స్వయంగా పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, పారదర్శకమైన, వేగవంతమైన పాలన దిశగా తెలంగాణ అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు.
