- జిల్లాలో కొత్తవారి ఎంపిక పూర్తి
- వచ్చే నెల నుంచి పెరిగిన పెన్షన్లు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆసరా లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని సెర్ప్ అధికారులు ప్రకటించారు. ఈ నెలాఖరులోగా హైదరాబాద్లోనూ పూర్తిచేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 39 లక్షల మంది వృద్ధులు ఆసరా పెన్షన్ అందుకుంటున్నారు. వీరికోసం ప్రభుత్వం రూ.5500 కోట్లు ఖర్చుచేస్తోంది. తాజాగా ఆసరా పెన్షన్ అర్హత వయసును 62 నుంచి 57 కు తగ్గించడంతో మరో 7 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని అధికారులు చెప్పారు. దీంతో ఖర్చు రూ.10 వేల కోట్లకు పెరుగుతుందన్నారు. ఈ పెన్షన్ల కోసం ప్రభుత్వం ఓటాన్బడ్జెట్లో రూ.12 వేల కోట్లను కేటాయించింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆసరా పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని సీఎం కేసీఆర్ప్రకటించారు. దివ్యాంగుల పెన్షన్1500 నుంచి 3016 , ఇతర వర్గాలకు ఇస్తున్న పెన్షన్ ను రూ.2016లకు పెంచారు. పెంచిన పెన్షన్లను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇస్తామని ప్రకటించినప్పటికి వరుస ఎన్నికలు, కోడ్ తో కుదరలేదు. లోక్ సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పెరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. వచ్చే నెల నుంచి పెరిగిన పెన్షన్లను అధికారులు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.