అక్టోబర్ 16 నుంచే మక్కల కొనుగోళ్లు మార్క్ఫెడ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 200 సెంటర్ల ఏర్పాటు

అక్టోబర్ 16 నుంచే  మక్కల కొనుగోళ్లు మార్క్ఫెడ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 200 సెంటర్ల ఏర్పాటు
  • మద్దతు ధర రూ.2,400 చెల్లించాలని నిర్ణయం
  • వానాకాలంలో 6.40 లక్షల ఎకరాల్లో మక్కల సాగు
  • 11 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా

హైదరాబాద్, వెలుగు: వానాకాలంలో సాగైన మక్కలను గురువారం నుంచి కొనుగోలు చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఈ సీజన్​లో మొక్కజొన్న పంట మార్కెట్​కు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్క్​ఫెడ్​ను  నోడల్​ ఏజెన్సీగా  నియమించి మక్కల కొనుగోళ్ల బాధ్యతలు అప్పగించింది. మార్క్​ఫెడ్​ అధికారులు కొనుగోళ్లపై  కసరత్తు పూర్తి చేసి, ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసి మద్దతు ధరతో మక్కలు కొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

రైతులు తక్కువ ధరకు ప్రైవేట్​ వ్యాపారులకు అమ్ముకొని నష్టపోకుండా సర్కారు రంగంలోకి దిగింది. మార్కెట్​కు దిగుబడి రావడం ప్రారంభం కాగానే, అందుకు అనుగుణంగా జిల్లాల వారీగా సెంటర్లను ప్రారంభించనున్నారు. క్వింటాల్​కు రూ.2,400 చొప్పున మద్దతు ధరతో కొనుగోలు చేయనున్నారు.

6 లక్షల టన్నులు కొనుగోలుకు ఏర్పాట్లు..

ఈ వానాకాలంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 6.44 లక్షల ఎకరాల్లో మక్కలు సాగు చేసి రాష్ట్ర రైతులు రికార్డు సృష్టించారు. వానాకాలం మక్కల సాధారణ సాగు విస్తీర్ణం 5.21లక్షల ఎకరాలు కాగా,  నిరుడు ఇదే టైమ్​కు 5.23లక్షల ఎకరాల్లో సాగైంది. కాగా, ఈ ఏడాది నిరుటి కంటే 1.23 లక్షల ఎకరాలకు పైగా మక్కలు సాగైనట్లు వ్యవసాయశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నివేదికలో పేర్కొంది. మక్కల సాగులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 96,882 ఎకరాలతో టాప్​లో ఉండగా, ఆ తరువాత రంగారెడ్డి జిల్లాలో 68,654 ఎకరాలు, మహబూబాబాద్​ జిల్లాలో 62,566 ఎకరాల్లో సాగైంది.

 నాగర్​ కర్నూల్​ జిల్లాలో 56,906 ఎకరాల్లో, నిజామాబాద్​ జిల్లాలో 52,093 ఎకరాల్లో, కామారెడ్డి జిల్లాలో 50,728 ఎకరాల్లో సాగైనట్లు అధికారిక నివేదికలో పేర్కొన్నారు. వానాకాలం సీజన్​లో 11లక్షల టన్నులు మార్కెట్​కు వస్తుందని అంచనా వేశారు. మార్క్​ఫెడ్​ ఆధ్వర్యంలో  నిర్వహించే కొనుగోలు సెంటర్లకు 5 నుంచి 6 లక్షల టన్నుల మక్కలు వస్తాయని మార్క్ ఫెడ్ అధికారులు అంచనా వేస్తున్నారు. 

చేతికి వస్తున్న మక్క పంట..

ముందస్తుగా పంట సాగు చేసిన కొన్ని ప్రాంతాల్లో ఇప్పుటికే మక్కలు మార్కెట్​కు వస్తుండగా, ఇంకొన్ని జిల్లాల్లో చివరి దశలో ఉంది. మరికొన్ని జిల్లాల్లో పంట కోసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మార్కెట్​కు వస్తున్న మక్కలకు బహిరంగ మార్కెట్​లో మద్దతు ధర కంటే తక్కువగా చెల్లిస్తున్నారు. ఈక్రమంలో ప్రభుత్వం మార్క్​ఫెడ్​  ద్వారా కొనుగోళ్లకు సమాయత్తమైంది.

200 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం..

మార్కెట్​కు మక్కలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు  గురువారం నుంచి మక్కల కొనుగోళ్లు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 200 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్లాన్​ చేస్తున్నాం. -శ్రీనివాస్​రెడ్డి, ఎండీ, మార్క్​ఫెడ్​