జనగామ అర్బన్, వెలుగు : ఉద్యోగాలు, పెట్రోల్ బంకులు ఇప్పిస్తామని చెప్పి అమాయకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన మోసగాళ్లను జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం జనగామ పీఎస్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఏసీపీ పండేరి చేతన్ నితిన్ వివరాలు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులు జనగామకు చెందిన బెలిగిని శివకుమార్, అదిలాబాద్ కు చెందిన ఇల్లందుల శ్రీనివాస్, కరీంనగర్కు చెందిన ఆకవరం సాయి చరణ్, హనుమకొండకు చెందిన దరావత్ రాజేశ్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు పురోహితుడైన శివకుమార్ ప్రజలతో పరిచయాలు పెంచుకొని, వారికి నమ్మకం కలిగించేలా ప్రవర్తించేవాడు.
ఉన్నతస్థాయి రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులతో పరిచయాలు ఉన్నాయని నమ్మించి ఉద్యోగాలు, పెట్రోల్ బంక్ లు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి, ఆ మొత్తాన్ని మిగితా నిందితులతో పంచుకునేవాడని తెలిపారు. ఈ క్రమంలో జనగామ పీఎస్లో కేసులు నమోదు కావడంతో ప్రత్యేక బృందం రంగంలోకి దిగి, హనుమకొండ రోడ్లోని ఇండియన్ బంక్ వద్ద నిందితులను పట్టుకున్నారు. కేసును ఛేదించిన సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సై భరత్, సిబ్బందిని డీసీపీ రాజమహేంద్ర నాయక్ అభినందించారు.
