70 ఏళ్ల తర్వాత.. కిమ్కు 0.07 శాతం వ్యతిరేకంగా ఓట్లు.. వాళ్లకు మూడినట్లే..!

70 ఏళ్ల తర్వాత.. కిమ్కు 0.07 శాతం వ్యతిరేకంగా ఓట్లు.. వాళ్లకు మూడినట్లే..!

ఉత్తర కొరియా పేరు వినగానే గుర్తొచ్చేది నియంత పాలన. కిమ్ జోంగ్ ఉన్ ఆ దేశాన్ని పాలిస్తున్న నియంత. కానీ.. నియంత పాలిస్తున్న ఉత్తర కొరియాలో కూడా పార్లమెంటరీ ఎన్నికలు జరిగాయి. ఈ పార్లమెంటరీ ఎన్నికల్లో కిమ్ జోంగ్ ఉన్ పార్టీ అయిన కొరియా వర్కర్స్ పార్టీ (WPK), ఈ పార్టీ మిత్ర పక్షాలు 99.97% ఓట్లతో పాటు అన్ని సీట్లను కైవసం చేసుకున్నాయి. ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా సంస్థ కేసీఎన్ఏ ఈ వివరాలను వెల్లడించింది. ఈ విజయంతో మరో గ్రాండ్ విక్టరీ కిమ్ జోంగ్ ఉన్ ఖాతాలో చేరింది.

నార్త్ కొరియా15వ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ సభ్యులను ఎన్నుకోవడానికి మార్చి 15న ఈ ఓటింగ్ జరిగింది. అధికారిక లెక్కల ప్రకారం.. 99.99 శాతం మంది ఓటింగ్లో పాల్గొన్నారు. కేవలం 0.0037 శాతం మంది మాత్రమే విదేశాలలో ఉండటం వల్ల.. సముద్రంలో విధుల్లో ఉండటం వల్ల ఓటు వేయలేకపోయారు. 0.03% మంది మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

ఓటు వేసిన వారిలో, 99.93% మంది అభ్యర్థులకు మద్దతు ఇవ్వగా, 0.07% మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఉత్తర కొరియా ఎన్నికలలో ఇది ఒక అసాధారణమైన విషయం. కిమ్ జోంగ్ ఉన్ కు వ్యతిరేకంగా ఓటు వేసిన వారెవరనే ఆసక్తి సోషల్ మీడియాలో నెలకొంది. అంత ధైర్యం చేసిన వాళ్లెవరని సోషల్ మీడియాలో సెటైర్లు కనిపించాయి.

డిపిఆర్‌కె ఎన్నికల చట్టాల ప్రకారం, కార్మికులు, రైతులు, మేధావులు, సైనిక సిబ్బంది, అధికారులు సహా 687 మంది ప్రతినిధులు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1957 తర్వాత సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ ఎన్నికలలో మొదటిసారిగా వ్యతిరేక ఓట్లు పడినట్లు ప్రభుత్వ మీడియా తెలపడం విశేషం. ఎన్నికైన వారిలో కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ కూడా ఉన్నారు. ఆమె కల్లిమ్‌గిల్ నియోజకవర్గం నెం. 5లో గెలుపొందారు.