హైదరాబాద్, వెలుగు: గతంలో అక్రిడిటేషన్ కార్డులున్న అర్హులైన వర్కింగ్ జర్నలిస్టుల పాత కార్డుల గడువును వచ్చే నెల 1 వరకు పొడిగించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొత్తగా కార్డులు కోరుతున్న వారికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
అక్రిడిటేషన్ అర్హతలపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ హైటెక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, క్రియేటివ్ ఇండియా బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్లను చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ వి. రామకృష్ణారెడ్డి డివిజన్ బెంచ్ మంగళవారం విచారించింది. ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సమర్పించిన 535 మంది సభ్యుల జాబితాలో 268 మందికే గతంలో అక్రిడిటేషన్ కార్డులు ఉన్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
