
హైదరాబాద్,వెలుగు: ఏపీ సీఎం జగన్ కేసుల్ని 2024 ఎలక్షన్స్ లోపు విచారణ పూర్తి చేసేలా సీబీఐ కోర్టుకు ఆదేశాలివ్వాలని కోరుతూ ఏపీ మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య వేసిన పిల్ పై తెలంగాణ హైకోర్టు మండిపడింది. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలతో పిల్ దాఖలు చేయడమేమిటని తీవ్రంగా తప్పుపట్టింది. చేగొండి పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ఉజ్జల్భూయాన్, జస్టిస్ తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ తాజాగా విచారించింది. పిల్ పై కోర్టు స్పందిస్తూ.. ఎలక్షన్స్ లోపు విచారణ పూర్తి చేసేలా సీబీఐ కోర్టుకు ఉత్తర్వులివ్వాలని కోరడం ఒక విధంగా కోర్టులను భయపెట్టడమేనని వ్యాఖ్యానించింది. ఇది పూర్తిగా పబ్లిక్ న్యూసెసెన్స్ పిటిషన్ అని.. కోర్టు టైమ్ను వేస్టు చేశారని అసహనం వ్యక్తం చేసింది. పిల్కు నంబర్ కేటాయించేందుకు కూడా హైకోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది. తదుపరి విచారణను కోర్టు జూలై 6కి వాయిదా వేసింది.