హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని బండ్లగూడ మండలం కేశవగిరి కాలనీలో ఒవైసీకి చెందిన సలార్-–ఇ–-మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ భవన నిర్మాణాలకు సంబంధించి యథాతథస్థితి కొనసాగించాలంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు గురువారం ఉపసంహరించుకుంది. ఇదే అంశానికి సంబంధించిన మరో పిటిషన్ పెండింగ్లో ఉందనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడంతో కోర్టు గత ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది.
సలార్–ఇ–మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి ఈ నెల 6న యథాతథస్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ కేసులో ప్రతివాదిగా తనను కూడా చేర్చాలని కోరుతూ న్యాయవాది విజయగోపాల్ ఇంప్లీడ్ పిటిషన్ వేయడంతో దీనిపై తిరిగి విచారణ జరిగింది.
