ఉద్యోగులకు డీఏ 3.64 % పెంపు.. వచ్చే నెల జీతంలో కలిపి చెల్లింపు

ఉద్యోగులకు డీఏ 3.64 %  పెంపు.. వచ్చే నెల జీతంలో కలిపి చెల్లింపు
  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • సర్కారుపై ఏడాదికి సుమారు రూ.2,400 కోట్ల అదనపు భారం

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులకు రాష్ట్ర సర్కార్ శుభవార్త చెప్పింది. 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. పెంచిన డీఏ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. పెంచిన డీఏను 2025 జూన్ నెల జీతంతో కలిపి జులైలో చెల్లిస్తారు. ఈ తాజా డీఏ పెంపుతో ప్రతి నెల సగటున ప్రభుత్వ ఖజానాపై రూ.200 కోట్లు, ఏడాదికి సుమారు రూ.2,400 కోట్ల అదనపు భారం పడనుంది.

2020 రివైజ్డ్ పే స్కేల్స్‌లో జీతం పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ బేసిక్ పేలో 26.39% నుండి 30.03% కి పెంచారు. ఈ డీఏ పెంపు జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, వర్క్ చార్జ్​డ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది, ఎయిడెడ్ సంస్థలు (పాలిటెక్నిక్‌లతో సహా) యూనివర్సిటీలలోని టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందికి కూడా అందనుంది.

యూజీసీ, ఏఐసీటీఈ పే స్కేల్స్ ఉద్యోగులకు డీఏ 38% నుండి 42% కి పెంచారు. రాష్ట్రంలోని ఉద్యోగులకు 5 డీఏ బకాయిల రావాల్సి ఉంది.  ఇటీవల రాష్ట్ర కేబినెట్​లో తీసుకున్న నిర్ణయం మేరకు ఉద్యోగులకు రెండు డీఏలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో ఒక డీఏ తక్షణమే ఇస్తున్నట్లు తెలిపారు. రెండో డీఏను మరో 6 నెలల్లో ఇస్తామని ప్రభుత్వంలోని మంత్రులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా డీఏ ఉత్తర్వులు జారీ చేశారు.

జీవో ప్రకారం 2023 జనవరి 1 నుంచి 2025 మే 31 వరకు ఉన్న డీఏ బకాయిలను ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) ఖాతాలకు జమ చేస్తారు. 2025 అక్టోబర్ 31లోపు పదవీవిరమణ చేసే ఉద్యోగులకు మాత్రం, డీఏ బకాయిలను 28 సమాన నెలవారీ వాయిదాలలో చెల్లిస్తారు. ఇక 2004 సెప్టెంబర్ లో ప్రభుత్వ సర్వీసులో చేరి, కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) కింద ఉన్న ఉద్యోగులకు, 2023 జనవరి1 నుంచి 2025 మే 31 వరకు ఉన్న డీఏ బకాయిలలో 10% వారి ప్రాన్ ఖాతాలకు జమ చేశారు. మిగిలిన 90% డీఏ బకాయిలను 28 సమాన నెలవారీ వాయిదాలలో చెల్లిస్తారు.