ఆర్మీ ట్రక్కు ప్రమాదంలో .. తెలంగాణ జవాన్​ మృతి

ఆర్మీ ట్రక్కు ప్రమాదంలో .. తెలంగాణ జవాన్​ మృతి
  • దేవునిపల్లిలో విషాదఛాయలు 

షాద్ నగర్, వెలుగు: లడఖ్ లో జరిగిన ఆర్మీ ట్రక్కు ప్రమాదంలో షాద్​నగర్ నియోజకవర్గంలోని కొందుర్గ్ మండలం తిరుమల దేవునిపల్లి గ్రామానికి చెందిన జవాన్​చంద్రశేఖర్ మృతి చెందాడు. లడఖ్​లోని లేహ్​లో ఆర్మీ కాన్వాయ్​లోని ట్రక్కు శనివారం సాయంత్రం అదుపుతప్పి నదిలో పడిపోయి తొమ్మిది మంది జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే. 

దేవునిపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య,శివమ్మల కుమారుడు చంద్రశేఖర్. దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో 2011లో ఆర్మీ లో జాయిన్ అయ్యాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంద్రశేఖర్​ మరణ వార్త తెలిసి అటు తల్లి దండ్రులు, ఇటు భార్య శోక సంద్రంలో మునిగిపోయారు. దేవునిపల్లి గ్రామంలోనూ ఒక్క సారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. 

పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ జవాన్ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో చంద్రశేఖర్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు.