
పంచాయతీలకు ఎన్నికలకు పంచాయతీరాజ్ సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే ఓటరు జాబితా, వార్డుల విభజన, పోలింగ్ కేంద్రాల గుర్తింపుతోపాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పేపరు, ఎన్నికలకు సంబంధించి సామగ్రిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆర్వోలు, పీవోలకు శిక్షణ ఇచ్చారు. వివిధ రాజకీయ పక్షాల నాయకులతో ఎన్నికల సంఘం సమావేశమైంది. ఎన్నికల అధికారులకు ట్రైనింగ్ కూడా పూర్తి చేశారు. త్వరలోనే మరోసారి అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది.
తెలంగాణలో 12,848 గ్రామాలు ఉండగా ప్రస్తుతం వార్డులు 1,12,680, ఎంపీటీసీ స్థానాలు 5,307 ఉన్నాయి. మున్సిపాలిటీల విస్తీరణలో భాగంగా 73 గ్రామాలను విలీనం చేశారు. దీంతో 12,775 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు 570 ఎంపీపీ స్థానాలు ఉండగా.. 567 మండలాలకు మాత్రమే ఎంపీపీలను ఎన్నుకోనున్నారు. ఎంపీపీ స్థానాల సంఖ్య ఎంతో జడ్పీటీసీల స్థానాల సంఖ్య అంతే ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 32 జడ్పీ చైర్మన్ స్థానాలుండగా మేడ్చల్ జిల్లాలోని గ్రామాలన్నీ సిటీలో కలవడంతో ఒక జడ్పీ చైర్మన్ స్థానం తగ్గిపోనున్నది. 31 జడ్పీ చైర్మన్లను మాత్రమే ఎన్నుకోనున్నారు.
రాష్ట్రంలో 73 గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం కావడంతో ఈ గ్రామాలను లోకల్ బాడీ ఎన్నికల జాబితా నుంచి తొలగించారు. ములుగు, కల్లూరు, బిచ్కుంద, అలియాబాద్, రామగుండం, పెద్ద అంబర్పేట, చేవెళ్ల, మొయినాబాద్, కొత్తగూడెం, అమీన్పూర్, మద్దూరుతో పాటు పలు మున్సిపాలిటీల్లో పలు గ్రామాలు విలీనం కావడంతో మున్సిపాలిటీల పాలనలోకి వెళ్లాయి. ఈ గ్రామాల విలీనంతో ఆయా మండలాల్లోని కొన్ని గ్రామాలు కొంత డిస్ట్రబ్ అయ్యాయి. ఎంపీటీసీ ఎన్నికలకు ఇది అవరోధంగా మారనున్నది. ఈ గ్రామాల్లో ఎన్నికల విషయంలో ఎలా ముందుకెళ్లాలనేదానిపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.