
- కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు
- ప్రతి ప్రత్యేక కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు
- కర్ణాటక కేబినెట్ ముందుకు ముసాయిదా బిల్లు
- గతంలో ఈ విషయాన్ని ప్రస్తావించిన పీసీసీ చీఫ్
హైదరాబాద్: సోషల్ మీడియాలో తప్పుడు వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం త్వరలోనే ఓ చట్టాన్ని తీసుకు రాబోతుంది. నకిలీ వార్తలు ప్రచారం చేసే వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధించనున్నారు. దీనికి సంబంధించిన ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. 'కర్ణాటక మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ఫేక్ న్యూస్ యాక్ట్' పేరుతో రూపొందించిన ఈ ముసాయిదా త్వరలోనే చట్టరూపం దాల్చనుంది.
తప్పుడు వార్తలకు సంబంధించిన కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి కోర్టుకు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమిస్తారు. ఈ చర్యలు తప్పుడు సమాచారం వల్ల జరిగే నష్టాన్ని తగ్గించి, బాధ్యులను త్వరగా శిక్షించడానికి దోహద పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. గత వారం ఈ బిల్లును కేబినెట్ ముందు ప్రవేశపెట్టారు. త్వరలోనే దీనికి చట్టబద్దత లభించే అవకాశం ఉంది.
రాష్ట్రంలోనూ అమలు చేస్తారా?
సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఫేక్ ప్రచారానికి అడ్డుకట్ట వేస్తామని, ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకువస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గతంలో కామెంట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న కర్ణాటక ప్రభుత్వం 'కర్ణాటక మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ఫేక్ న్యూస్ యాక్ట్' అమల్లోకి తేనుంది. ఈ తరుణంలో రాష్ట్రంలోనూ ఈ తరహా చట్టం అమల్లోకి వస్తుందా..? అన్న చర్చ మొదలైంది. సోషల్ మీడియా వేదికగా రాష్ట్రంలో అడ్డగోలుగా ఫేక్ న్యూస్ వ్యాప్తి జరుగుతోంది.
మార్ఫింగ్ ఫొటోలు, బాడీ షేమింగ్ లు, తప్పుడు కథనాలను మసిపూసి మారేడు కాయ చేసే వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫేక్ న్యూస్, తప్పుడు పోస్టులపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఒకానొక దశలో జీవోలనూ కూడా మార్ఫింగ్ చేయడం గమనార్హం. వీటన్నింటికీ కర్ణాటక తరహా చట్టం అమల్లోకి రావడమే ఏకై క పరిష్కారమనే వాదన బలంగా వినిపిస్తోంది.