వ్యాఖ్యల వివాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన

వ్యాఖ్యల వివాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన

హైదరాబాద్: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తనకు సోదరుల వంటి వారని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో తమకు 30 సంవత్సరాలుగా ఉన్న స్నేహబంధం రాజకీయాలకు మించినదేనని తెలిపారు. తమ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, పరస్పర గౌరవం ఎప్పుడూ అలాగే కొనసాగిందని, ఎవరు విడదీయరానిదని పొన్నం చెప్పుకొచ్చారు. ఆయనపై తాను ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా, బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా, తనకు ఎవరిపైనా అలాంటి అభిప్రాయం ఉండదని పొన్నం తెలిపారు. 

రాజకీయ దురుద్దేశంతో కొంతమంది తన వ్యాఖ్యలను వక్రీకరించి, వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారని పొన్నం వివరణ ఇచ్చారు. దాంతో ఏర్పడిన అపార్థాల వల్ల అన్న లాంటి వారు అయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మనసు నొచ్చుకుందని తెలిసి తాను తీవ్రంగా విచారిస్తున్నానని మంత్రి పొన్నం ఒక ప్రకటన విడుదల చేశారు.

అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మనసు నొచ్చుకొని ఉంటే చింతిస్తున్నానని పొన్నం ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయడంలో,రాహుల్ గాంధీ నాయకత్వంలో సామాజిక న్యాయం సాధనలో, ప్రజల అభ్యున్నతికై తాము ఇద్దరం కలిసికట్టుగా కృషి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.