ఉమ్మడి నల్గొండ జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి : మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు

ఉమ్మడి నల్గొండ జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి : మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
  • అధికారులు ప్రజా సేవకు పునరంకితం కావాలి
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 
  • ఐదేండ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం 
  •  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • కేబినెట్‌ నిర్ణయాలను అమలు చేసేది కలెక్టర్లే 
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

సూర్యాపేట, వెలుగు :  ఉమ్మడి నల్గొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని, జిల్లాను అన్నిరంగాల్లో అగ్రస్థానంలో నిలపాలని రాష్ట్ర వ్యవసాయశాఖ, జిల్లా ఇన్​చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భునవగిరి జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి చట్టం అమలు తీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నీటిపారుదల, సివిల్‌ సప్లయ్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ అధికారులు నిర్లక్ష్యం వీడి పేదల సంక్షేమం కోసం పనిచేయాలన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి ప్రజా సేవకు అందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారులు మరింత కష్టపడి పనిచేయాలని కోరారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఈ ఏడాది లక్ష మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాములను మంజూరు చేస్తామని, ఇందుకు స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్లకు సూచించారు. నల్గొండ జిల్లాకు అదనంగా ఏఈవోలు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడిగారని, వారి విజ్ఞప్తి మేరకు ఏఈవోలను నియమించుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చామన్నారు. వెంటనే అవసరమైనంత మంది ఏఈవోలను నియమించుకుని ప్రభుత్వానికి అనుమతి కోసం ప్రపోజల్స్ పంపించాలని తెలిపారు. 

ఐదేండ్లలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రానున్న ఐదేండ్లలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ పనులు త్వరలోనే మొదలు పెడతామని, సాగర్‌ లెఫ్ట్​ కెనాల్‌ చివరి ఎకరాకు నీళ్లిస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలో ఈసారి అత్యధికంగా ధాన్యం సేకరించడంతో ప్రత్యేకంగా నల్గొండ కలెక్టర్‌ ఇలా త్రిపాఠిని అభినందించారు. బీఆర్ఎస్ హయాంలో 2023లో యాసంగిలో ధాన్యం అమ్మిన రైతులకు రూ.3,600 కోట్లు చెల్లిస్తే, తమ ప్రభుత్వం ఈసారి రూ.13,250 కోట్లు చెల్లించిందన్నారు. 

గతంలో 2.87 కోట్ల మందికి రూ.10 వేల కోట్ల ఖర్చు చేసి దొడ్డు బియ్యం అందించగా, 70 శాతం బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోయిందని చెప్పారు. కాంగ్రెస్​ ప్రభుత్వం సన్న వడ్లు పండించిన రైతులకు రూ.500 బోనస్‌ ఇచ్చి లబ్ధిదారులకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అడిగిన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రానున్న రోజుల్లో సన్నబియ్యంతోపాటు రేషన్‌ సరుకులు ఇస్తామని తెలిపారు. సూర్యాపేట ఫారెస్ట్‌ భూములాన్నిటికీ తిరిగి పచ్చదనం తీసుకొచ్చేలా అవసరమైతే తన ఎమ్మెల్యే నిధులు ఇస్తానని ప్రకటించారు. అధికారులు అలసత్వం వీడాలని, అవినీతిని సహించేది లేదని హెచ్చరించారు. 

కలెక్టర్లదే ముఖ్య పాత్ర -: మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి 

కేబినెట్‌ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కలెక్టర్లదే ముఖ్యపాత్ర అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను అన్నింటా ముందుంచేందుకు అధికారులు కృషి చేయాలని చెప్పారు. నల్గొండ జిల్లాలో ధాన్యం ఉత్పత్తి ఎక్కువగా ఉన్నందున అదనపు గోదాముల అవసరం ఉందన్నారు. గోదాములను మంజూరు చేయడమే కాకుండా, క్లస్టర్లు, ఏఈవో పోస్టులను మంజూరు చేయాలని వ్యవసాయశాఖ మంత్రిని కోరారు. తన శాఖ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాకు అత్యధికంగా రూ.1700 కోట్లు కేటాయించానని తెలిపారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ధాన్యం సేకరణలో ఇంకా కొంతమంది మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఈ అంశంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. 

ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అనర్హులు జాబితాలో లేకుండా చూసుకోవాలని కోరారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సన్మానించారు. సమావేశంలో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి కుందూరు జైవీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్‌ నాయక్, నెల్లికంటి సత్యం, రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్‌ పటేల్‌ రమేశ్ రెడ్డి, కలెక్టర్లు తేజస్‌ నందలాల్‌ పవార్‌, ఇలా త్రిపాఠి, హనుమంతరావు, ఎస్పీ నరసింహ, వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ సభ్యుడు చెవిటి వెంకన్నయాదవ్, సూర్యాపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొప్పుల వేణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వంగవీటి రామారావు తదితరులు పాల్గొన్నారు.