బనకచర్లకు అనుమతులు ఇవ్వొద్దు : మంత్రి ఉత్తమ్

బనకచర్లకు అనుమతులు ఇవ్వొద్దు : మంత్రి ఉత్తమ్
  • కేంద్ర పర్యావరణ శాఖకు మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి
  • ఏపీ ప్రతిపాదనను తిరస్కరించండి
  • జీబీ లింక్​తో గోదావరి నీటి వాటాల్లో తేడాలొస్తయ్​
  • టీవోఆర్​కు ఏపీ పెట్టిన రిక్వెస్ట్‌‌ను ఆమోదించొద్దు
  • కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్​కు మంత్రి ఉత్తమ్​ లేఖ

హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్‌‌ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి – బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దని, ఏపీ ప్రతిపాదనను తిరస్కరించాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. జీబీ లింక్ తో గోదావరిలో నీటి ప్రవాహ పరిస్థితులు, పరిమాణాలు మారిపోతాయని అన్నారు. దాని వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

 ఈ మేరకు సోమవారం  కేంద్ర మంత్రి భూపేందర్ ​యాదవ్​కు మంత్రి ఉత్తమ్​ లేఖ రాశారు. “టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ (టీవోఆర్)కు విజ్ఞప్తి చేస్తూ కేంద్ర పర్యావరణ శాఖకు ఏపీ ప్రతిపాదనలు పెట్టినట్టు తెలిసింది. ఈ అంశాన్ని మంగళవారం నిర్వహించనున్న 33వ ఎక్స్​పర్ట్​ అప్రైజల్ కమిటీ (టీఏసీ) మీటింగ్​లో ఎజెండాగా పెట్టినట్టు తెలిసింది. అసలు జీబీ లింక్ చేపట్టే హక్కు ఏపీకి లేనే లేదు. ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనలు గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధం” అని లేఖలో పేర్కొన్నారు. 

నీటి వాటాలు మార్చే కుట్ర

వరద జలాల పేరుతో పోలవరం ప్రాజెక్ట్ ను విస్తరించేందుకు ఏపీ కుట్రలు చేస్తున్నదని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. వరద జలాల పేరు చెప్పి నీటిని అక్రమంగా తరలించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని, గోదావరి ట్రిబ్యునల్ అవార్డు, టీఏసీ అనుమతుల్లో ఏకపక్షంగా మార్పులు చేయించాలన్న కుట్రలకు తెరదీసిందని అన్నారు. ఏపీకి ఇలాంటివి కొత్తేమీ కాదని, ఎప్పుడూ ఇలాగే చేస్తున్నదని తెలిపారు. కృష్ణ, గోదావరి నీటి కేటాయింపులపై పదే పదే ఉల్లంఘనలకు పాల్పడుతున్నదని పేర్కొన్నారు. ఇప్పుడు అదే తీరున వ్యవహరిస్తున్నదని చెప్పారు. 

పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా..

జీబీ లింక్​పై ఏపీ.. పోలవరం ప్రాజెక్టు కు 2005లో ఇచ్చిన పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా పనిచేస్తున్నదని ఉత్తమ్ తెలిపారు. ప్రాజెక్ట్ ను విస్తరిస్తూ పనుల స్కోప్​ను మార్చడంతో.. వెంటనే ఆపేయాలంటూ 2011 ఫిబ్రవరి 8న కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలిచ్చిందని, అయితే ఆ ఉత్తర్వులను కేంద్రం నిలిపివేసిందన్నారు. 2026 జులై 2 వరకు పొడిగింపు ఇచ్చారని చెప్పారు. దీంతో తెలంగాణ, చత్తీస్​గఢ్​, ఒడిశాల అభ్యంతరాలు, ఆందోళనలు పట్టించుకోకుండా ఈ ప్రాజెక్టుకు కేంద్రం సహకరిస్తున్నదన్నారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి నిధులు కూడా మంజూరు చేస్తున్నదని తెలిపారు.

ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నదన్నారు. “సుప్రీం కూడా ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని డాక్యుమెంట్స్ కావాలని చెప్పింది. పర్యావరణ అనుమతులపైనా మాట్లాడాలి. కాబట్టి కేంద్ర జలశక్తి శాఖ, పర్యావరణ శాఖ మంత్రులు.. జీబీ లింక్ లో భాగమైన ప్రధానమైన వాళ్లతో సమావేశం నిర్వహించాలి” అని కోరారు.

జలశక్తి శాఖ హామీ ఇచ్చింది

ఏపీ అక్రమంగా చేపడుతున్న ఈ జీబీ లింక్​ను అడ్డుకోవాల్సిందిగా కేంద్ర జల శక్తి శాఖను కోరామని మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న గైడ్​లైన్స్​, నీటి కేటాయింపులు, అంతర్రాష్ట్ర ఒప్పందాలు, విభజన చట్టంలోని నిబంధనలకు తగ్గట్టుగానే ప్రాజెక్ట్ ప్రపోజల్ ను సెంట్రల్ వాటర్ కమిషన్ పరిశీలిస్తుందంటూ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఏపీ ఇప్పటికే సీడబ్ల్యూసీకి ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ను సమర్పించిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కృష్ణా, గోదావరి బోర్డుల పరిశీలనకు సీడబ్ల్యూసీ పంపించిందన్నారు.