గిగ్ వర్కర్ల కోసం విశ్రాంతి గదులు.. హైదరాబాద్ లో ఐదు ఏర్పాటు.. జెప్టోతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

గిగ్ వర్కర్ల కోసం విశ్రాంతి గదులు.. హైదరాబాద్ లో ఐదు ఏర్పాటు.. జెప్టోతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
  • వాష్‌‌ రూమ్స్, వైఫై, ఫస్ట్​ ఎయిడ్​.. తదితర వసతులు

హైదరాబాద్, వెలుగు:  రాత్రనకా పగలనకా బైకులపై తిరుగుతూ పనిచేసే గిగ్​వర్కర్ల కోసం విశ్రాంతి గదులు నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం,  క్విక్ కామర్స్ సంస్థ  జెప్టో చేతులు కలిపాయి. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్​ మల్కాజిగిరిలో ప్రాజెక్ట్ ప్రగతి పేరుతో ఐదు కేంద్రాలను నిర్మిస్తారు.  నగరంలోని గిగ్ వర్కర్లలో 69 శాతం మందికి కనీసం మరుగుదొడ్ల సదుపాయం లేదని, 80 శాతం డెలివరీ బాయ్స్​కు ఎండ నుంచి సేదతీరేందుకు నీడ సైతం దొరకడం లేదని ఒక సర్వేలో తేలింది.  

ఈ కేంద్రాల్లో ఏసీ విశ్రాంతి గదులు, తాగునీరు, టాయిలెట్స్​, మొబైల్ చార్జర్లు, వైఫై, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు ఉంటాయని జ. తరచూ ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ‘ఈ–-శ్రమ్’ పోర్టల్ రిజిస్ట్రేషన్లపై  అవగాహన కల్పించనున్నారు. ఈ కేంద్రాల నిర్వహణ భారాన్ని జెప్టోయే భరించనుంది.  ఫుడ్ డెలివరీ, ఈ–-కామర్స్, క్విక్ కామర్స్, కొరియర్ కంపెనీల్లో పనిచేసే ప్లాట్‌‌ఫామ్స్​, గిగ్ వర్కర్లకు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. 

హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు గిగ్, ప్లాట్‌‌ఫామ్ వర్కర్లు అత్యంత కీలకమని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పేర్కొన్నారు. దేశంలో గిగ్ వర్కర్ల సంఖ్య 2020– -21 నాటి 77 లక్షల నుంచి 2029–30 నాటికి 2.35 కోట్లకు పెరగనుందని, శ్రామిక శక్తి పెరుగుతున్న కొద్దీ వారికి కనీస మానవతా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జెప్టో సీఓవో వికాస్ ఈ సందర్భంగా వివరించారు.