తెలంగాణ గీతం జయ జయహే..జూన్​ 2న జాతికి అంకితం

తెలంగాణ గీతం జయ జయహే..జూన్​ 2న జాతికి అంకితం
  • రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపై అసెంబ్లీలో 
  • చర్చించి నిర్ణయం.. సీఎం రేవంత్​రెడ్డి ప్రకటన
  • రెండు వెర్షన్లుగా రాష్ట్ర గీతం.. రెండున్నర నిమిషాలతో షార్ట్​ వెర్షన్​.. 13.30 నిమిషాలతో ఫుల్​ వెర్షన్​
  • అందెశ్రీ రాసిన దాంట్లో మార్పులు లేకుండా ఆమోదం
  • రాష్ట్ర చిహ్నం కోసం 500 నమూనాలు అందినయ్​
  • చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం ఇంకా ఫైనల్​ కాలేదు
  • అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా, తెలంగాణ ప్రతిష్ఠ ఇనుమడించేలా కార్యాచరణ
  • ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి వెల్లడి

హైదరాబాద్, వెలుగు: అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ పాటను యథాతథంగా తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ఆమోదించిందని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. జూన్​ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఈ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు. కేబినెట్​లో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్ర గీతాన్ని ఆమోదించామని వెల్లడించారు. 

రాష్ట్ర అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని  నిర్ణయం జరిగిందని.. కళాకారులు వివిధ నమూనాలు తయారు చేస్తున్నారని తెలిపారు. కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అపోహలు, తప్పుడు ప్రచారాలకు తావులేకుండా అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్ఠ ఇనుమడించేలా, భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు. గురువారం సాయంత్రం సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్​ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. 

ఇందులో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్​రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్​ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి,  దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, తుమ్మల నాగేశ్వర్​రావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, లోక్​సభలో తెలంగాణ బిల్లును ఆమోదించినప్పుడు సభలో ఉన్న తెలంగాణ సభ్యులు, ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాది జూన్ 2 నాటికి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.  

యథాతథంగా రాష్ట్ర గీతం

ఉద్యమకాలంలో అందరినీ ఉత్తేజపరిచిన, తెలంగాణ ఖ్యాతిని చాటిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని తరతరాలు పాడుకునేలా, అందరి ఆమోదంతో రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ ఇరవై ఏండ్ల కిందట రాసిన ఈ గేయాన్ని యథాతథంగా ఆమోదించినట్లు ఆయన ప్రకటించారు. జూన్​ 2న జాతికి అంకితం చేయనున్నామని, ఈ పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం సమకూర్చారని తెలిపారు.  రాష్ట్ర గీతాన్ని రెండు వెర్షన్లలో తయారు చేశామని.. 2.30 నిమిషాల నిడివితో ఒక వెర్షన్, 13.30 నిమిషాల నిడివితో పూర్తి వర్షన్ రూపొందించినట్లు వివరించారు. ఈ రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణిస్తామన్నారు.  

చర్చల దశలో చిహ్నం నమూనాలు 

తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని, అందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించిన సంక్షిప్త రూపం ‘టీఎస్’ ను ‘టీజీ’గా మార్చినట్లు సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థల పేర్లలో ‘టీజీ’గా మార్పు చేశామన్నారు. రాష్ట్ర చిహ్నంపై ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి దాదాపు 500 నమూనాలు తమకు అందాయని సీఎం వెల్లడించారు. ఇంకా నమూనాలన్నీ చర్చల దశలోనే ఉన్నాయని, చిహ్నానికి సంబంధించిన తుది రూపమేదీ ఇంకా ఖరారు కాలేదన్నారు. 

తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తుది నిర్ణయమేది జరగలేదని, కళాకారులు వివిధ నమూనాలు తయారు చేస్తున్నారని ఆయన చెప్పారు.  కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అపోహలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్ఠను ఇనుమడించేలా, భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కాగా, సమావేశంలో జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సింగర్స్​ ఆలపించారు.