600 టీమ్లతో తెలుగు ప్రీమియర్ లీగ్.. ప్రైజ్ మనీ రూ. 80 లక్షలు

600 టీమ్లతో  తెలుగు ప్రీమియర్ లీగ్.. ప్రైజ్ మనీ  రూ. 80 లక్షలు

హైదరాబాద్‌: తెలుగు ప్రీమియర్‌ లీగ్‌ (టీపీఎల్‌) క్రికెట్‌ పోటీల పోస్టర్‌ను తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. మంత్రిని ఆయన కార్యాలయంలో టీపీఎల్‌ను నిర్వహిస్తున్న జూపర్‌ ఎల్‌ఈడీ సంస్థ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి, లీగ్‌ విశేషాలను వివరించారు.  ఈ సందర్బంగా మాట్లాడిని మంత్రి శ్రీహరి.. యువతను మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా క్రమశిక్షణ గల క్రీడాకారుడిగా, బాధ్యయుత పౌరుడిగా తయారు చేసే శక్తి క్రీడలకు ఉందన్నారు. క్రికెట్‌తో పాటు ఏదొక క్రీడలో యువత రాణించాలని, తద్వారా ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ కూడా అలవడుతుందని చెప్పారు. 

‘సే నో టూ’ డ్రగ్స్‌ ప్రచారాన్ని యువతలోకి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న ఈ టీపీఎల్‌ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం లీగ్‌ నిర్వాహక సంస్థ జూపర్‌ ఎల్‌ఈడీ డైరెక్టర్ ఒ.రమేష్‌ మాట్లాడుతూ.. తమ సీఎస్ఆర్ నిధులతో ఈ పోటీల‌ను నిర్వహిస్తోందని తెలిపారు.ఈ లీగ్‌ను కేవలం వినోదం కోసం నిర్వహించకుండా సమాజంలో ఆరోగ్య భద్రత, ఫిట్‌నెస్‌, క్రీడలపై అవగాహన పెంచేందుకు నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 60 వేదికల్లో 600 టీమ్‌లతో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. నాకౌట్‌ పోటీలకు తెలంగాణ నుంచి 4, ఏపీ నుంచి 4 జట్లు ఎంపిక చేస్తామని అన్నారు. గ్రామీణ క్రికెటర్లకు పెద్ద వేదికలపై క్రికెట్‌ ఆడే అవకాశం కల్పించాలనేది కూడా తమ ఆలోచన అని తెలిపారు. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్‌ మనీ రూ.80 లక్షలు తెలిపారు.