- వరద నష్టానికి రూ.500 కోట్ల తక్షణ సాయం
- రూ.60 వేల కోట్లతో మెట్రో విస్తరణ
- జేబీఎస్ నుంచి తూంకుంట, ప్యాట్నీ నుంచి
- కండ్లకోయ దాకా మెట్రో కోసం డబుల్ డెక్కర్ రూట్
- భవిష్యత్తులో షాద్నగర్ వరకు మెట్రో విస్తరణ
- ‘సౌతిండియా సెంటర్ ఫర్ కాపు’ కోసం స్థలం
- గవర్నర్ తిప్పి పంపిన 4 బిల్లులు మళ్లీ అసెంబ్లీకి
- కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: టీఎస్ఆర్టీసీ ఇక రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం కానుంది. సంస్థ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ విలీనానికి సంబంధించి విధివిధానాలు, నిబంధనలు రూపొందించేందుకు అధికారులతో కూడిన ఒక సబ్కమిటీని ఏర్పాటు చేశారు.
కేబినెట్ నిర్ణయాలను మంత్రి కేటీఆర్ మీడియాకు వెల్లడించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని, సంస్థలో పనిచేస్తున్న 43,373 మంది ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కేబినెట్లో నిర్ణయం తీసు కున్నట్లు చెప్పారు. ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అందుకు అవసరమైన బిల్లును తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 18 నుంచి 28 వరకు రాష్ట్రంలో పెద్దఎత్తున వర్షాలు కురిశాయని, జనజీవనం అస్తవ్యస్తమైందని ఆయన అన్నారు. ఉమ్మడి వరంగల్తో పాటు భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, ఆదిలాబాద్, 10 జిల్లాల్లో భారీ వర్షాల వల్ల రైతులు, ప్రజలకు తలెత్తిన తీవ్ర నష్టంపై కేబినెట్లో చర్చించినట్లు చెప్పారు. భారీ వర్షాలు, వరదలకు తక్షణ సాయం కింద రూ.500 కోట్లు ఇవ్వాలని కేబినెట్ ఆదేశించిందని ఆయన వెల్లడించారు.
భవిష్యత్తులో షాద్నగర్ వరకు మెట్రో
మూడు, నాలుగేండ్లలో మెట్రోను భారీగా విస్తరించాలని కేబినెట్లో నిర్ణయించినట్లు కేటీఆర్ చెప్పారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో రైలు టెండర్ ప్రక్రియ జరుగుతున్నదన్నారు. జేబీఎస్ నుంచి తూంకుంట వరకు, ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు మెట్రో కోసం డబుల్ డెక్కర్ రూట్, ఇస్నాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రో విస్తరణకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. మియాపూర్ నుంచి లక్డీకపూల్ వరకు మెట్రో, ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్పేట వరకు మెట్రో విస్తరణకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉప్పల్ నుంచి బీబీ నగర్, భవిష్యత్తులో కొత్తూరు మీదుగా షాద్నగర్ వరకు మెట్రో విస్తరణ కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని చెప్పారు. ఉప్పల్ నుంచి ఈసీఐఎల్, పాతబస్తీ మెట్రోను కూడా సమగ్రంగా పూర్తిచేస్తామని తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి కందుకూరు వరకు మెట్రో విస్తరణ చేపడ్తామన్నారు. ఓఆర్ఆర్ చుట్టూ కలిపి అన్ని రూట్లతో మొత్తం 400 కిలో మీటర్ల మేర మెట్రో రైలు విస్తరణకు రూ. 60 వేల కోట్లు ఖర్చు చేస్తామని ఆయన వెల్లడించారు.
2024లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం
మెట్రో విస్తరణ కోసం కేంద్రం సహకారం అడుగుతా మని కేటీఆర్ చెప్పారు. ‘‘ఇప్పుడు ఇవ్వకపోతే 2024లో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. అప్పుడు సహకారం ఉంటుంది” అని ఆయన అన్నారు. ‘‘వర్షాలు, వరద నష్టం కోసం కేంద్ర ప్రభుత్వం రాజకీయం బంద్ చేసి.. సాయం చేయడం నేర్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వానికి చెప్పినా.. గోడకు చెప్పినా ఒక్కటే అన్నట్లుగా ఉంది” అని దుయ్యబట్టారు.
ఆ 4 బిల్లులు తిరిగి ఆమోదిస్తం
గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపిన 4 బిల్లులపై కేబినెట్లో చర్చించామని, రానున్న అసెంబ్లీ సమావేశాల్లో మళ్లీ వాటిని పెట్టి ఆమోదిస్తామని కేటీఆర్ తెలిపారు. ‘‘ఇలాంటప్పుడు రాజ్యాంగపరంగా చూసి నా గవర్నర్ తప్పకుండా వాటిని ఆమోదించాల్సిందే. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నది” అని ఆరోపించారు. గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. కేబినెట్ చేసిన ఈ సిఫార్సుకు ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. రోడ్లు, కల్వర్టులకు మరమ్మతులు చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించినట్లు కేటీఆర్ వివరించారు. దాదాపు 27 వేల మంది ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. వరదల్లో ఇద్దరు విద్యుత్ ఉద్యోగులు తమ కర్తవ్యాన్ని అద్భుతంగా నిర్వర్తించారని, ఆగస్టు 15న వారిని ప్రభుత్వం సత్కరిస్తుందన్నారు. ఆశ్రమ పాఠశాలలో 40 మంది పిల్లలను కాపాడిన టీచర్కు కూడా సన్మానిస్తామని ప్రకటించారు. వరదల కారణంగా 40 మందికిపైగా చనిపోయారని, వాళ్ల వివరాలు సేకరించి.. ఎక్స్గ్రేషియా అందిస్తామన్నారు. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖను కేబినెట్ ఆదేశించిందని కేటీఆర్ వెల్లడించారు.
యూనియన్ నేతల హర్షం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న కేబినెట్ నిర్ణయంపై ఆర్టీసీ యూనియన్ల నేతలు సంతోషం వ్యక్తం చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత దక్కిందని టీఎంయూ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి అన్నారు. విలీనం తర్వాత కార్మికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి కోరారు. విలీనం తర్వాత అయినా కార్మికులకు రావాల్సిన పీఆర్సీలు, సీసీఎస్, ఇతర బకాయిలు చెల్లించాలని టీజేఎంయూ జనరల్ సెక్రటరీ హనుమంతు ముదిరాజ్ కోరారు. విలీనం తర్వాత కమిటీ అధికారులు యూనియన్ల సూచనలు తీసుకోవాల ని ఎన్ఎంయూ నేతలు కమాల్ రెడ్డి, నరేందర్ డిమాండ్ చేశారు. కమిటీ రిపోర్ట్ త్వరగా ఇవ్వాలని అశ్వత్థామరెడ్డి కోరారు.
కార్మికుల కష్టానికి ఫలితం: బాజిరెడ్డి, సజ్జనార్
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులకు సీఎం న్యాయం చేశారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆర్టీసీలోని 43 వేల మంది సిబ్బంది శ్రమకు దక్కిన గౌరవం ఇదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు.
కేబినెట్ నిర్ణయాల్లో మరికొన్ని..
అనాథలను ‘చిల్డ్రన్ ఆఫ్ స్టేట్’గా గుర్తిస్తూ.. ఆర్ఫాన్ పాలనీ రూపొందించాలని నిర్ణయం.మహబూబాబాద్లో హార్టీకల్చర్ కాలేజీ
ఏర్పాటుకు ఆమోదం.
- ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లలో 50 శాతం గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్ల తరహాలో... ఇంకో 50 శాతం నిమ్స్ తరహాలో వైద్యం అందించేలా నిర్ణయం.
- వరంగల్లోని మామునూర్ ఎయిర్పోర్ట్ను బీదర్ ఎయిర్పోర్టు తరహాలో నడిపేందుకు కేంద్రాన్ని కోరాలని నిర్ణయం.
- పుణె, గోవాలో రక్షణ శాఖకు సంబంధించిన ఎయిర్పోర్టులను పౌర విమానాయాలకు వాడుతున్నట్లే హకీంపేట ఎయిర్పోర్టును హైబ్రిడ్ పద్ధతిలో నడపాలని కేంద్రాన్ని కోరాలని తీర్మానం.
- ‘సౌతిండియా సెంటర్ ఫర్ కాపు’ కోసం స్థలం కేటాయిస్తూ నిర్ణయం.
- మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం.
- బీడీ టేకేదార్లకు కూడా రూ.2 వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం.
- పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయా లని అగ్రికల్చర్, రెవెన్యూ అధికారులకు ఆదేశం.
- ఖమ్మం పట్టణాన్ని మున్నేరు వరదల నుంచి రక్షించేందుకు ఆర్సీసీ వాల్తో ఫ్లడ్ బ్యాంక్ నిర్మించాలని నిర్ణయం.