- సిర్పూర్ పేపర్ మిల్లు కార్మిక సంఘాల నేతలతో
- మంత్రి వివేక్ వెంకటస్వామి భేటీ
- పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విఠల్,
- 10 కార్మిక సంఘాల నేతలు
హైదరాబాద్/ఎల్బీ నగర్/కోల్బెల్ట్, వెలుగు: కార్మిక సంఘాల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. కార్మికుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. బుధవారం సిర్పూర్ పేపర్ మిల్లు కార్మిక సంఘాల ప్రతినిధులతో సెక్రటేరియెట్లో మంత్రి సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ దండే విఠల్, బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబుతో పాటు 10 కార్మిక సంఘాల నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్మిక సంఘాల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. అలాగే, పేపర్ మిల్లు కార్మికులకు సంబంధించిన న్యాయపరమైన అంశాలపై అడ్వకేట్ జనరల్ ద్వారా కేసును వాదించి.. పెండింగ్లో ఉన్న అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్యాంటీన్ ఏర్పాటు నిబంధనలను ఉల్లంఘిస్తున్న అంశంపై ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు ఫ్యాక్టరీస్ డైరెక్టర్ నోటీసు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు.
సిర్పూర్లో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు అంశంపై కార్మిక సంఘాలు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, సిర్పూర్లో ఏటీసీ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. లేబర్ వెల్ఫేర్ సెంటర్కు సంబంధించిన స్థలాల్లో ఉన్న ఆక్రమణలను తొలగించి, భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక శాఖ మంత్రి వివేక్ తెలిపారు. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోందని.. త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. హైదరాబాద్లోని నాగోల్ కల్యాణ లక్ష్మి గార్డెన్స్ లో బుధవారం తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వేలాదిమంది ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్.. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ లో విలీనమైందని, వర్కర్స్ యూనియన్ నూతన అధ్యక్షుడిగా మొగుళ్ల రాజిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక కార్యదర్శి ఈ.అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. అనంతరం ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి మంత్రి వివేక్ మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని బలోపేతం చేయడంతో పాటు కార్మికుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. కార్మికులు తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని.. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, తాను కలిసి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
అనంతరం ఎమ్మెల్సీ కోదండరామ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా నష్టపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కరానికి సానుకూలంగా ఉందని తెలిపారు. జీహెచ్ఎంసీ మాజీ మేయర్, కాంగ్రెస్నేత బొంతు రామ్మోహన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి, ప్రముఖ గాయకుడు నల్గొండ గద్దర్, ఐ ఎన్ టీ యూ సీ జాయింట్సెక్రటరీ ఇందిరా రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు.
