
- ప్రతి మండలానికి 2 జీపీ, 2 అంగన్ వాడీ బిల్డింగులు
- ఈ ఏడాది టార్గెట్ 1,148 సెంటర్లు: మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: త్వరలో కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, అంగన్ వాడీ భవనాలకు శంకుస్థాపన చేస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. చివరి త్రైమాసికంలో భవనాల నిర్మాణాలు చేపట్టడం వల్ల పనులు పెండింంఫలో మిగిలిపోతున్నాయని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అందుకే ఈ దఫా మొదటి త్రైమాసికంలో స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేస్తున్నామని, యునిక్ డిజైన్తో త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు.
కాగా.. రాష్ట్రంలోని ప్రతి మండలానికి 2 గ్రామ పంచాయతీ భవనాలు, రెండు అంగన్వాడీ భవనాలు నిర్మించాలని టార్గెట్ పెట్టుకున్న పంచాయతీ రాజ్ శాఖ అందుకు తగ్గట్లు స్థలాలను గుర్తిస్తోంది. ఈ ఏడాది 1,148 అంగన్ వాడీ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుంది.
ఇప్పటికే 813 అంగన్ వాడీ భవనాల నిర్మాణానికి స్థలాలను అధికారులు గుర్తించారు. మరో 98 చోట్ల గుర్తించాల్సి ఉంది. ఉపాధి హమీ నిధుల ద్వారా ఒక్కో పంచాయతీ భవన నిర్మాణంపై రూ.20 లక్షలు ఖర్చు చేయనున్నారు. అంగన్ వాడీ భవనం కోసం ఉపాధి హమీ నిధుల ద్వారా రూ.8 లక్షలు, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు రూ.2 లక్షలు, మహిళా శిశు సంక్షేమం నుంచి రూ.2 లక్షలు మొత్తం కలిపి రూ.12 లక్షలు వెచ్చించనున్నారు.
వచ్చే ఏడాది మార్చి నాటికి మొత్తం 1,148 జీపీ భవనాలు, 1,148 అంగన్ వాడీ భవనాలను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. మిగిలిన భవనాలకు సంబంధించి గతంలో భవనాల నిర్మాణం మొదలుపెట్టగా నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి స్థలాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ వంటి జిల్లాల్లో స్థలాల గుర్తింపుకు ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా ఆయా భవనాలను చూడగానే ప్రజలు వాటిని జీపీ, అంగన్ వాడీ భవనాలని గుర్తించేలా డిజైన్ రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం జీపీ భవనాలకు, అంగన్ వాడీలకు వేర్వేరుగా డిజైన్లు రూపొందిస్తున్నారు.