- అన్ని బిల్డింగ్లు ఒకే డిజైన్లో ఉండేలా చర్యలు: పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
- అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఆఫీసులకు సొంత బిల్డింగ్లు నిర్మిస్తామని వెల్లడి
- మొదటి విడతలో 60 తహసీల్దార్, 5 ఆర్డీవో ఆఫీసులు నిర్మిస్తామన్న మంత్రి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలకు సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్, ఆర్డీవో ఆఫీసులకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మొదటి దశలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 60 తహసీల్దార్ ఆఫీసులు, 5 ఆర్డీవో కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు.
అలాగే, రెండో విడతలో శిథిలావస్థలో ఉన్న 170 ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని భవనాలు ఒకే నమూనాలో, ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి డిజైన్లకు తుది రూపు ఇస్తామని చెప్పారు. బుధవారం సెక్రటేరియెట్లో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో ఎన్ని తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి? శిథిలావస్థ, పాలనకు అనువుగా లేని భవనాల వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగడం సరైంది కాదని, ప్రజలకు సేవలందించే కేంద్రాలు గౌరవప్రదంగా ఉండాలన్న సీఎం ఆలోచనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడ్డాక కూడా రెవెన్యూ కార్యాలయాలు ప్రజలకు సౌకర్యవంతంగా లేకపోవడంతో పాటు చాలా వరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయన్నారు.
ప్రణాళిక లేకుండా మండలాల పునర్విభజన..
గత ప్రభుత్వం ఓ ప్రణాళిక లేకుండా మండలాల పునర్విభజన చేపట్టిందని, కొన్ని మండలాలు రెండు, మూడు జిల్లాల పరిధిలోకి వచ్చేలా రూపొందించిందని మంత్రి పొంగులేటి విమర్శించారు. అనేక కార్యాలయాల్లో కనీస వసతులు లేకపోవడం, సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తర్వాత కొత్త మండలాలకు అవసరమైన పోస్టులు మంజూరు చేసి, పరిపాలనను బలోపేతం చేశామని తెలిపారు.
అలాగే ప్రజలకు దూరంగా కలక్టరేట్లను నిర్మించి నిర్వహణను గాలికొదిలేశారని విమర్శించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అత్యాధునిక వసతులతో సమీకృత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు.
ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి సమీకృత భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే గచ్చిబౌలి, మేడ్చల్ మల్కాజిగిరి, పటాన్చెరులో భవనాలకు శంకుస్థాపన పూర్తయిందన్నారు. గచ్చిబౌలిలో నిర్మాణ పనులు తుది దశలో వచ్చాయని, మరికొన్ని నెలల్లో ప్రారంభానికి సిద్ధం అవుతుందని ఆయన తెలిపారు.
