
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మహిళా యూనివర్సిటీపై గత బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం.. ప్రస్తుతం విద్యార్థులకు శాపంగా మారింది. రెండేండ్ల కింద కోఠి ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేసినా.. నాటి సర్కార్ చట్టం మాత్రం చేయలేదు. వరుసగా గత రెండు బడ్జెట్లలో మహిళా యూనివర్సిటీకి రూ. వంద కోట్ల చొప్పున కేటాయించినా, ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేదు. దీంతో ఇటు విద్యార్థులు, అటు ఫ్యాకల్టీ, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
సర్టిఫికెట్ల జారీ ఎలా?
హైదరాబాద్లోని కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేస్తూ 2022 ఏప్రిల్లో అప్పటి ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. దీంతో 2022–23 విద్యాసంవత్సరంలో మహిళా యూనివర్సిటీ పేరుతోనే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు నిర్వహించింది. వర్సిటీగా అప్గ్రేడ్ చేసిన ఏడాదికి అదే కాలేజీ ప్రిన్సిపల్ను ఇన్ చార్జ్ వీసీగా నాటి సర్కారు ప్రకటించింది. ప్రస్తుతం వర్సిటీలో సుమారు ఐదువేలమంది చదువుతున్నారు. పీజీలో చేరిన వారి చదువు ఈ ఏడాదితో పూర్తికానుంది.
కానీ, ఇప్పటికీ వర్సిటీ పేరుతో చట్టం కాలేదు. దీంతో సర్టిఫికెట్లు ఎలా జారీ చేయాలనే దానిపై అధికారుల్లో అయోమయం మొదలైంది. ప్రస్తుతం పీజీ కోర్సుల్లో 70%పైగా మహిళలే ఉన్నారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో మహిళా యూనివర్సిటీ లేనిది కేవలం తెలంగాణ మాత్రమేనని అధికారులే చెప్తున్నారు.
స్టూడెంట్ల నుంచి ఫీజుల వసూలు
గత బీఆర్ఎస్ సర్కారు 2022–23, 2023–24 సంవత్సర బడ్జెట్లలో తెలంగాణ మహిళా యూనివర్సిటీకి రూ.వంద కోట్ల చొప్పున కేటాయించింది. కానీ రెండు సంవత్సరాలూ వర్సిటీకి రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో పిల్లల నుంచి ఫీజులు వసూలు చేసి, యూనివర్సిటీని నిర్వహిస్తున్నారు. వర్సిటీలో వివిధ అభివృద్ధి పనులకోసం ప్రతిపాదనలు పంపించినా పైసా రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం వర్సిటీలో మొత్తం టీచింగ్ సిబ్బంది సుమారు 320 మంది, నాన్ టీచింగ్ సిబ్బంది మరో 300 మంది దాకా పనిచేస్తున్నారు. వీరిలో సుమారు 40 మంది మాత్రమే రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారని అధికారులు చెప్తున్నారు. సిబ్బంది జీతాలు ఇంకా ఓయూ నుంచే అందుతున్నాయి. అయితే, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ సిబ్బంది విభజన చేస్తామని సర్కారు ప్రకటించినా, అది ఇంతవరకూ అమలు కాలేదు.
త్వరలో సీఎంకు రిపోర్టు
కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేస్తున్నట్టు సర్కారు కాగితంపై జీవో మాత్రమే రిలీజ్ చేసింది. కానీ, వర్సిటీకి ప్రత్యేకంగా చట్టం చేస్తేనే, పూర్తిస్థాయి వర్సిటీగా గుర్తింపు పొందినట్టు అవుతుంది. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు ఆగమేఘాలపై అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయించుకున్న బీఆర్ఎస్ సర్కారు.. మహిళా యూనివర్సిటీ బిల్లు మాత్రం పెట్టలేదు. దీని ప్రభావం వర్సిటీ వీసీ నియామకంపై పడింది. తాజాగా పది యూనివర్సిటీలకు వీసీల రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ ఇవ్వగా, చట్టం లేకపోవడంతో ఆ వర్సిటీని లిస్టులో చేర్చలేకపోయింది. త్వరలోనే వర్సిటీపై ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్టు ఇవ్వనున్నట్టు సమాచారం.