
- రాష్ట్రం వచ్చిన తొలి ఏడాదిలో కట్టింది 7 వేల కోట్లు.. ఇప్పుడు 60 వేల కోట్లు
- ఇప్పటిదాక కిస్తీలు, వడ్డీలకే రూ.2.41 లక్షల కోట్లు కట్టిన సర్కారు
- అందులో వడ్డీలకే రూ.1,60,990 కోట్లు
- వచ్చే మూడేండ్లలో ఇంకో 2 లక్షల కోట్లు కట్టాలె
- అప్పులు కట్టడానికి మళ్లీ అప్పులు..
- భూములు అమ్ముడు.. జనాలపై బాదుడు
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆగమాగం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అప్పులు ఏటేటా పెరిగిపోతున్నాయి. గడిచిన తొమ్మిదేండ్లలో అప్పుల కిస్తీలు, వడ్డీల కింద ఏకంగా రూ.2.41 లక్షల కోట్లను రాష్ట్ర సర్కారు కట్టింది. ఇందులో కేవలం వడ్డీల కింద చెల్లించిన మొత్తమే రూ.1.60 లక్షల కోట్లు!! భవిష్యత్లో కట్టాల్సిన అప్పులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. 9 ఏండ్లలో కట్టినంత స్థాయిలో ఈ మూడేండ్లలో చెల్లించాల్సి ఉన్నది. 2023–24 నుంచి 2025–26 దాకా సర్కార్ ఇంకో రూ.2.04 లక్షల కోట్లను బాకీలకు, వాటి వడ్డీలకు కట్టాల్సి ఉన్నది. ఇందుకోసం మళ్లీ అప్పులు చేస్తున్నది. ప్రభుత్వ భూములు అమ్ముతున్నది. అవీ సరిపోక జనాలపై పన్నుల భారం మోపుతున్నది. ఇలా గడిచిన రెండేండ్లలో లిక్కర్ రేట్లు, భూముల మార్కెట్ వాల్యూ, రిజిస్ర్టేషన్ చార్జీలు, ఆర్టీఏలో టాక్స్లను భారీగా పెంచింది. అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదుట పడటం లేదు. ఉద్యోగులకు జీతాలు టైమ్కు ఇవ్వలేకపోవడం, ఆసరా పెన్షన్లు నెలఖారుకు పంపిణీ చేయడం, సంక్షేమ పథకాలకు అరకొర నిధులే ఇవ్వడం, రూ.వేల కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టడం కొనసాగుతున్నది.
ఏటేటా పెరుగుతోంది...
తెలంగాణ ఏర్పాటైనప్పుడు మిగులు రాష్ట్రంగా ఉండగా.. తొలి ఏడాదిలో అప్పుల కిస్తీలకు, వడ్డీలకు కట్టిన మొత్తం రూ.7 వేల కోట్లు మాత్రమే. ఆ తర్వాత ఏడాది నుంచి ఈ మొత్తం పెరుగుతూ పోయింది. 2016–17లో రూ.12,619 కోట్లు, 2017–18లో రూ.17,663 కోట్లు, 2018–19లో రూ.23,812 కోట్లు, 2019–20లో రూ.30,438 కోట్లు, 2020–21లో రూ.33,386 కోట్లు, 2021–22లో రూ.45,866 కోట్లను కట్టింది.
గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఏకంగా రూ.59,943 కోట్ల చెల్లింపులు చేసింది. అంటే అప్పు లు, వడ్డీల కింద చెల్లిస్తున్న మొత్తం తొమ్మిదేండ్లలో తొ మ్మిదింతలు పెరిగింది. ఈ లెక్కలను చూస్తే.. ప్రభుత్వం అప్పులు ఏ రీతిలో చేసిందో అర్థమవుతుందని ఆఫీసర్లే అంటున్నారు.
బడ్జెట్లో చూపించకుండానే..
అప్పుల విషయం బయటపడకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు పడుతున్నది. బడ్జెట్లో చూపించకుండా.. అంటే ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాని ఆఫ్ బడ్జెట్ అప్పులు ఎక్కువగా చేసింది. కార్పొరేషన్ల పేరు కింద చేసిన అప్పులన్నీ ఆ కోవలోనివే. 2014–15 నుంచి 2022–23 వరకు ఔట్సైడ్ బడ్జెట్ అప్పులకు ప్రభుత్వం కట్టిన మొత్తం రూ.71,319 కోట్లు. ఈ లెక్కలను ప్రభుత్వం ఎక్కడా కనిపించకుండా దాస్తున్నది. ఇక వరుసగా ఈ ఏడాది రూ.25,680 కోట్లు, 2024–25లో రూ.24,488 కోట్లు, 2025–26లో రూ.23,869 కోట్లు కట్టనుంది.
అన్ని అప్పులు చేసినా.. పేదోడు బాగుపడలే
రాష్ట్ర ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పులతో పేదలకు మేలు జరగలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఆ అప్పులే రాష్ట్ర ప్రజలకు భారంగా మా రాయని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కొక్కరిపై ఉన్న అప్పు రూ.1.50 లక్షలకు చేరుతున్నది. అప్పు లు తీసుకుని క్యాపిటర్ ఎక్స్పెండిచర్ చేస్తున్నామని రా ష్ట్ర సర్కార్ చెబుతున్నది. కానీ కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులతో ఇంతవరకు మేలు జరగలేదు. పైగా వరదలకు మోటార్లు మునిగిపోతే ప్రభుత్వమే డబ్బులు కట్టి బాగు చేయించిదనే విమర్శలు ఉన్నాయి. మిషన్ భగీరథ నీళ్లు అని చెబుతున్నప్పటికీ.. అందరికీ అందడం లేదు. అనేక హామీలు అమలు చేస్తలేదు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ నిలిచిపోయింది. దళితబంధు పథకాన్ని ఏం చేస్తారో తెలియని పరిస్థితి. రైతులకు రుణమాఫీ చేయలేదు. నిరుద్యోగ భృతి, బీసీ, ఎస్టీలకు నిరంతర సబ్సిడీ స్కీమ్ల అమలు.. ఇంకా అనేకం అమలు చేసేందుకు అవకాశం ఉన్నా.. ప్రభుత్వం అప్పులను దుర్వినియోగం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. కల్యాణ లక్ష్మి, స్కాలర్షిప్లను కూడా టైమ్కు అందించడం లేదు. ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించలేదు. వివిధ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు కనీస పరిహారం కూడా చెల్లించలేని స్థితికి చేరుకున్నది. ధరణి వంటి పోర్టల్లో ఉచితంగా భూసమస్యలను పరిష్కరించాల్సి ఉండగా.. దాని నిర్వహణ కోసం కూడా రైతుల నుంచే ఫీజులు కట్టించుకుంటున్నది.
మూడేండ్లలో మరో రూ.2 లక్షల కోట్లు పైనే
ఈ ఆర్థిక సంవత్సరంతోపాటు రానున్న రెండు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన మొత్తం కూడా భారీగానే ఉంది. గత 9 ఏండ్లలో కట్టినంత.. వచ్చే మూడేం డ్లలో కిస్తీలు, వడ్డీలకు కలిపి చెల్లించాల్సి ఉన్నది. రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేసిన లెక్కల ప్రకారం 2023–24 నుంచి 2025–26 వరకు ప్రభుత్వం కట్టాల్సిన మొత్తం రూ.2.04 లక్షల కోట్లుగా ఉన్నది. అంటే యావరేజ్గా ఏటా రూ.70 వేల కోట్లు చెల్లించాలి. అంటే రాష్ట్ర బడ్జెట్లో 35 శాతానికి పైగా నిధులు అప్పుల చెల్లింపులకే పోతాయి.
వడ్డీలకు కడుతున్నదే ఎక్కువ
రాష్ట్ర సర్కార్ చేసిన అప్పుల్లో వడ్డీలకే ఎక్కువ మొత్తంలో చెల్లిస్తున్నది. ఇప్పటి వరకు చేసిన చెల్లింపుల్లో కిస్తీల కింద రూ.79 వేల కోట్లు చెల్లించింది. వడ్డీలకు మాత్రం రూ.1,60,990 కోట్లు కట్టింది. 9 ఏండ్లలో వివిధ ఆర్థిక సంస్థలతో పాటు బ్యాంకులు, ఆర్బీఐ నుంచి తీసుకున్న అప్పులకు ఈ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించింది. గత ఆర్థిక సంవత్సరం వడ్డీలకు కట్టిన మొత్తం రూ.35,791 కోట్లు. ఇవన్నీ రాష్ట్ర ఖజానాలో నుంచే చెల్లిస్తున్నది. ఈ సంవత్సరం కూడా దాదాపు ఇంతే మొత్తంలో కట్టాల్సి ఉన్నది. కానీ బడ్జెట్ లెక్కల్లో గతేడాది రూ.20 వేల కోట్లే కట్టినట్లు చూపెడుతున్నది. అసలు ఎంత కడుతున్నారనేది చెప్పకుండా ప్రభుత్వం దాస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీఎస్డీపీలో 25 శాతం మించి అప్పులు చేసింది. ఈ సంవత్సరంలో రాష్ట్ర అప్పులు అన్ని రకాలుగా కలిపి రూ.5 లక్షల కోట్లు దాటనున్నాయి.