
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేపర్ పులుల్లా టీవీల ముందు రంకెలేయొద్దని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ, సీబీఐ బీజేపీ జేబు సంస్థలన్న ఆయన.. బండి సంజయ్ వ్యవహారం గురవిందగింజ చందంగా ఉందని కామెంట్ చేశారు. బండి సంజయ్ వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ పై పోటీ చేస్తారో లేదో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. గతంలో పోటీ చేసిన సంజయ్.. ఇప్పుడు పోటీ చేయకపోతే... బీజేపీకి, బీఆర్ఎస్ కి మధ్య చీకటి ఒప్పందం ఏమిటో ప్రజలు గుర్తిస్తారని చెప్పారు. లిక్కర్ స్కాం కేసులో ఏం జరుగుతుందో ఈడీ అధికారులు ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకురాలు సోనియా పట్ల వ్యవహరించనట్లు.. లిక్కర్ కేసులో కవిత పట్ల ఎందుకు వ్యవహరించడంలేదు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇదంతా ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారన్న ఆయన.. అవినీతి ఆరోపణలు వచ్చిన రాజయ్యను బర్తరఫ్ చేసిన కేసీఆర్.. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని నిలదీశారు. ఈ ఇష్యూపై మౌనంగా ఉంటున్న కేసీఆర్ బండి సంజయ్ కి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై తాను ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎందుకు విచారణ చేపట్టలేదు? అని ప్రశ్నలు సంధించారు. కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ప్రధాని, కేంద్ర మంత్రులు చెప్పారని, అయినా కేసీఆర్ అవినీతిపై ఎందుకు విచారణ చేపట్టలేదని మండిపడ్డారు. మీకున్న కుమ్మక్కు రాజకీయాలు ఏమిటి? అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.