Char Dham Yatra: భక్తులకు అలర్ట్.. అమర్ నాథ్ యాత్రకు బ్రేక్​... ఎందుకంటే..

Char Dham Yatra: భక్తులకు అలర్ట్.. అమర్ నాథ్ యాత్రకు బ్రేక్​... ఎందుకంటే..

Char Dham Yatra: ఉత్తరాఖండ్‌ లోని గర్వాల్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో ఆదివారం ( జులై7) చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. జూలై 7, 8 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. యాత్రికుల భద్రత దృష్ట్యా యాత్రను వాయిదా వేస్తున్నట్లు గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. 

అమర్ నాథ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. భారీ వర్షాల కారణంగా.. భక్తులకు ఇబ్బందులు కలగకూడదని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. బల్తాల్, పహల్గాం మార్గాలలో వారం రోజుల నుంచి( జులై 7 వతేదీకి)  అడపా దడపా వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు.

గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్‌ లోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండలపై కొండచరియలు విరిగి పడ్డాయని...  కొండలపై నుంచి పడిన శిధిలాల కారణంగా బద్రీనాథ్‌ కు వెళ్లే హైవే చాలా చోట్ల మూసుకుపోయిందని సమాచారం.  చమోలి జిల్లాలోని కర్ణప్రయాగ్‌ లోని చత్వాపీపాల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో కొండపై నుండి పడిపోయిన రాళ్లతో భక్తులుయ చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక జోషిమఠ్ సమీపంలోని విష్ణు ప్రయాగ్‌ లో అలకనంద ప్రమాదకర స్థాయికి చేరువలో ప్రవహిస్తోంది. అలకనంద విష్ణు ప్రయాగలో ధౌలి గంగలో విలీనమవుతుంది.

అమర్నాథ్ ఆలయ గుహ, శేషనాగ్ శిఖరం వద్ద ఉష్ణోగ్రతలు పడిపోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణంగా అక్కడ 15 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత ఉంటే..  జులై 7 వ తేది  రాత్రికి ఆ ఉష్ణోగ్రత 5 డిగ్రీలకు పడిపోవచ్చని తెలిపింది. రానున్న మూడు రోజుల పాటు   ఉరుములతో కూడిన  భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.  భక్తులందరూ జూలై 7న రుషికేశ్ దాటి చార్ ధామ్ యాత్రకు వెళ్లవద్దని అభ్యర్థించారు. ఇప్పటికే యాత్రకు వెళ్లిన వారు తమ యాత్రను తిరిగి ప్రారంభించేందుకు వాతావరణం అనుకూలించే వరకు ఎక్కడున్నా వేచి ఉండాలని గర్వాల్ కమిషనర్  కోరారు.

ఈ ఏడాది జూన్ 29న అమర్నాథ్ యాత్ర ప్రారంభమవ్వగా.. 3800 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ క్షేత్రాన్ని ఇప్పటివరకూ 1.50 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ఆగస్టు 19న అమర్నాథ్ యాత్ర ముగియనుంది. గతేడాది 4.5 లక్షల మంది యాత్రికులు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఈ ఏడాది 52 రోజుల పాటు అమర్నాథ్ యాత్ర కొనసాగనుంది. కాగా.. అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన వారంరోజులకే మంచుశివలింగం కరిగిపోతుందన్న వార్త భక్తులను ఆందోళనకు గురి చేస్తుంది.