
- డబ్బులు తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారని బీఆర్ఎస్ ధర్నా
- రుజువులు చూపాలంటూ ఆందోళనకు దిగిన కాంగ్రెస్ లీడర్లు
మానకొండూరు, వెలుగు : డబ్బులు తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారని బీఆర్ఎస్.. ఇందుకు రుజువులు చూపాలని కాంగ్రెస్ పోటాపోటీగా ర్యాలీ నిర్వహించడంతో కరీంనగర్ జిల్లా మానకొండూరులో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకుండా, డబ్బులు తీసుకొని అనర్హులకు ఇస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లీడర్లు ధర్నాకు దిగారు. దీనికి పోటీగా కాంగ్రెస్నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఇరుపార్టీల పోటాపోటీ కార్యక్రమాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలు, లీడర్లను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
ధర్నా సందర్భంగా రసమయి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి 18 నెలలైనా ఇచ్చిన హామీలను అమలుచేయడం లేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మరో నాటకానికి తెరలేపారన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారంలో 26 ఎస్సీ కుటుంబాలు ఉంటే ఒక్క ఫ్యామిలీకి కూడా ఇల్లు కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి తన సొంత గ్రామమని చెప్పుకుంటున్న పచ్చునూరులో ఎంతమంది ఎస్సీ కుటుంబాలకు ఇండ్లు కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పాల్గొన్నారు.