
- మార్కెట్లో కొనసాగిన బుల్స్ జోరు
- సెన్సెక్స్, నిఫ్టీ సుమారు ఒక శాతం అప్
- ఇరాన్, ఇజ్రాయెల్ సీజ్ఫైర్తో మిడిల్ ఈస్ట్లో తగ్గిన టెన్షన్లు
- 79 డాలర్ల నుంచి 67 డాలర్లకు దిగొచ్చిన బ్రెంట్ క్రూడాయిల్
- షేర్లను అమ్మేస్తున్న ఎఫ్ఐఐలు
ముంబై: దలాల్ స్ట్రీట్లో బుల్స్ జోరు బుధవారం కూడా కొనసాగింది. బెంచ్మార్క్ ఇండెక్స్లు సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు ఒక శాతం ర్యాలీ చేశాయి. ఇరాన్–-ఇజ్రాయెల్ మధ్య సీజ్ఫైర్ ఒప్పందం కుదరడంతో మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ తగ్గాయి. గ్లోబల్ మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్ కొనసాగడం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి బడా కంపెనీల షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడంతో మార్కెట్ లాభాల్లో ముగిసింది.
మంగళవారం ర్యాలీని కొనసాగిస్తూ, సెన్సెక్స్ బుధవారం 700.40 పాయింట్లు (0.85శాతం) ఎగిసి 82,755.51 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 760.8 పాయింట్లు (0.92శాతం) పెరిగి 82,815.91 లెవెల్ను టచ్ చేసింది. బీఎస్ఈలో 2,821 స్టాక్స్ లాభపడగా, 1,207 నష్టపోయాయి. 134 షేర్లలో ఎటువంటి మార్పు లేదు. అలాగే, ఎన్ఎస్ఈ నిఫ్టీ 200.40 పాయింట్లు (0.80శాతం) పెరిగి 25,244.75 వద్ద సెటిల్ అయింది.
తగ్గిన యుద్ధ భయాలు
“ఇజ్రాయెల్- ఇరాన్ సీజ్ఫైర్ వల్ల జియోపొలిటికల్ ఒత్తిడి తగ్గి, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడింది. నిఫ్టీ లాభాల్లో మొదలై, చిన్న రేంజ్లో పాజిటివ్గా కదిలింది” అని బజాజ్ బ్రోకింగ్ పేర్కొంది. సెన్సెక్స్ స్టాక్స్లో టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, టీసీఎస్, భారతి ఎయిర్టెల్ బాగా పెరిగాయి. కానీ భారత్ ఎలక్ట్రానిక్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ నష్టాల్లో ముగిశాయి. రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా మాట్లాడుతూ, “అమెరికాతో సహా గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ రావడంతో మార్కెట్ బుధవారం గ్యాప్-అప్లో ఓపెన్ అయ్యింది.
కొన్ని ఇండెక్స్ హెవీవెయిట్ స్టాక్స్లో కొనుగోళ్లు పెరగడంతో ఇంట్రాడేలో మరింత పెరిగింది’’ అని అన్నారు. బీఎస్ఈ స్మాల్క్యాప్ బుధవారం 1.59శాతం పెరగగా, మిడ్క్యాప్ ఇండెక్స్ 0.63శాతం లాభపడింది. బీఎస్ఈ సెక్టోరల్ ఇండెక్స్లలో టెక్ 1.69శాతం, బీఎస్ఈ ఫోకస్డ్ ఐటీ 1.69శాతం, ఐటీ 1.68శాతం, టెలికమ్యూనికేషన్ 1.42శాతం, కన్స్యూమర్ డిస్క్రిషనరీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 1.26శాతం చొప్పున పెరిగాయి. కానీ క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్లు వెనకబడ్డాయి.
“మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ తగ్గడం, క్రూడ్ ఆయిల్ ధరలు కాస్త దిగిరావడం వల్ల భారత మార్కెట్లు రికవరీ అయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) షేర్లను అమ్మేస్తున్నా, గ్లోబల్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవ్వడంతో మన మార్కెట్కు సపోర్ట్ దొరికింది. ఈసారి వర్షాలు బాగాపడతాయనే అంచనా, ద్రవ్యోల్బణం దిగొస్తుండడం కలిసొచ్చింది” అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పీ, జపాన్ నిక్కీ 225, షాంఘై ఎస్ఎస్ఈ కంపోజిట్, హాంకాంగ్ హాంగ్ సెంగ్ బుధవారం లాభపడ్డాయి.
యూరోపియన్ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ రేటు బుధవారం బ్యారెల్కు 67.95 డాలర్ల వద్ద ఉంది. సీజ్ఫైర్ ప్రకటనకు ముందు 79 డాలర్లను టచ్ చేసింది. ఎఫ్ఐఐలు మంగళవారం నికరంగా రూ.5,266.01 కోట్ల విలువైన షేర్లను, బుధవారం మరో రూ.-2,306.10 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. డీఐఐలు మంగళవారం నికరంగా రూ.5,209.60 కోట్ల షేర్లను, బుధవారం రూ.2,018.14 కోట్ల షేర్లను కొన్నారు.