జమ్మూకాశ్మీర్ లో ఉగ్రఘాతుకం.. ఐదుగురు భారత జవాన్లు మృతి

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రఘాతుకం.. ఐదుగురు భారత జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్‌ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉగ్రవాదుల బాంబు పేలుడులో ఐదుగురు సైనికులు మృతి చెందారు. మరో జవాను చికిత్స పొందుతున్నాడు. 

ఇటీవల పూంచ్ జిల్లాలో ఆర్మీ ట్రక్కు పేల్చిన తర్వాత.. కాండి ఫారెస్ట్ లోని ఓ గుహలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు శుక్రవారం జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది నుంచి తప్పించుకునే క్రమంలో ఉగ్రవాదులు పేలుడు పదార్థాన్ని ప్రయోగించారు. ఈ పేలుడులో ఇద్దరు భద్రతా సిబ్బంది ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. 

నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఉధంపుర్‌లోని కమాండ్ ఆసుపత్రికి తలించారు. చికిత్స పొందుతూ మరో ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఉగ్రవాదులు ఆ ప్రాంతంలోనే దాక్కొని ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజౌరీ జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.

ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో ఆర్మీ ట్రక్కు పేలి ఐదుగురు సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. జవాన్లతో వెళ్తున్న ట్రక్కుపై ఉగ్రవాదులు గ్రనేడ్‌ దాడి చేయడంతో ఐదుగురు జవాన్లు సజీవ దహనమయ్యారు. భారీ వర్షాలు, విజిబులిటీ సరిగా లేకపోవడం వంటి పరిస్థితులను అనుకూలంగా మలచుకొని సైనికులు వెళ్తున్న ట్రక్కును లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు దిగారు.