ఫోన్ పేలో లంచాలు.. 8 మంది విద్యుత్ అధికారులపై TG SPDCL వేటు

ఫోన్ పేలో లంచాలు.. 8 మంది విద్యుత్ అధికారులపై TG SPDCL వేటు
  • టీజీఎస్​పీడీసీఎల్​ సీఎండీ ముషారఫ్​ అలీ ఫరూఖీ చర్యలు
  • సస్పెండ్ ​అయిన వారిలో ఒక ఏడీఈ, ముగ్గురు ఇంజినీర్లు

హైదరాబాద్​, వెలుగు: వినియోగదారుల నుంచి లంచాలు తీసుకుంటున్న విద్యుత్ ​అధికారులపై దక్షిణ విద్యుత్​ పంపిణీ సంస్థ(టీజీ ఎస్​పీడీసీఎల్) కొరడా ఝులిపించింది. డ్యూటీలో భాగంగా చేయాల్సిన పనులకు సైతం డబ్బులు వసూలు చేసిన 8 మంది ఇంజినీర్లను సస్పెండ్​ చేస్తూ గురువారం టీజీఎస్​పీడీసీఎల్​ సీఎండీ ముషారఫ్​ అలీ ఫరూఖీ ఉత్తర్వులు జారీ చేశారు.

సస్పెండ్​ అయిన వారిలో ఒక ఏడీఈ, ఇద్దరు ఏఈలు, ఒక సబ్​ ఇంజినీర్​, ముగ్గురు లైన్​మేన్లు, ఒక గ్రేడ్–3 ఉద్యోగి ఉన్నారు. విద్యుత్ శాఖలో అధికారులు, సిబ్బంది అవినీతిపై కొంతకాలంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. దక్షిణ డిస్కమ్​ పరిధిలో 150కు పైగా ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇంజినీర్లు ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ ద్వారా లంచాలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. రెగ్యులర్​ సేవలు అందించేందుకు, ఫైళ్లను త్వరగా పరిష్కరించేందుకు, కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు 8 మంది అధికారులు లంచాలు తీసుకున్నట్లు పక్కా ఆధారాలు సేకరించి, ఉన్నతాధికారులకు నివేదించారు. 

ఈ నివేదిక మేరకు భువనగిరి పరిధిలో ఏడీఈగా పనిచేస్తున్న ఆర్​. ఆనంద రెడ్డి, శాంతి నగర్​ ఏఈ  చిన్న సుబ్బరాయుడు,   భాగ్యనగర్​ సెక్షన్​ ఏఈగా పనిచేస్తున్న షాబాజ్​ అహ్మద్​, సంగారెడ్డి సర్కిల్​లో సబ్​ ఇంజినీర్​గా పనిచేస్తున్న జి.మధుసూదన్​, లైన్​మేన్లు జిల్లపల్లి శ్రీనివాస్​, షేక్​ శావలి, జూనియర్​ లైన్​మేన్​ డప్పు అంజిలయ్య, గ్రేడ్​–3 ఎంప్లాయ్​ ఎండీ. ఖలీల్​ను సస్పెండ్​ చేస్తూ సీఎండీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.