
- కంప్లయింట్ రావడంతో దర్యాప్తు చేయిస్తున్న టీజీఎండీసీ
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీజీఎండీసీ) లో తప్పుడు పత్రాలతో ఇసుక దోపిడీపై ఇంటర్నల్ ఎంక్వైరీని రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్నది. ఎక్కడ, ఎవరి ఆధ్వర్యంలో, ఎలా ఇసుక పక్కదారి పట్టిందనే దానిపై విచారణ చేయిస్తున్నది. బల్క్ బుకింగ్ యూజర్లు, బల్క్ బుకింగ్ ఆర్డర్లుఎన్ని ఉన్నాయి, గత 9 నెలల కాలంలో ఎక్కడెక్కడ ఎంతెంత ఉందనే దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. తప్పుడు పత్రాలు ఉన్నట్లు గుర్తిస్తున్న ప్రతి బుకింగ్ను బ్లాక్లో పెడుతున్నారు. ఈ వ్యవహారంలో టీజీఎండీసీ అధికారులు ఎవరున్నారనే దానిపై విచారణ చేస్తున్నారు. ప్రస్తుత టీజీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ మల్సూర్ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు.
లారీల యజమానులు కంప్లయింట్ చేయడంతో పాటు ఆందోళన చేస్తుండడంతో ఏం జరిగిందనే దానిపై కూపీ లాగితే అసలు విషయం బయటపడింది. ఇసుక డీడీల దందా జరగకుండా రెండేండ్ల కిందటి నుంచే ప్రభుత్వం ఆన్లైన్ వ్యవస్థను తీసుకువచ్చింది. ఈ క్రమంలో బల్క్ యూజర్ ఐడీ నుంచి ఇసుక కోసం వెబ్సైట్లో అప్లోడ్ చేసిన పేపర్లను పరిశీలించి అంతా ఓకే అనుకున్నాకే ఇసుక డీడీలను మంజూరు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత టీజీఎంఎడీసీని ఇంకింత ప్రక్షాళన చేసింది. డిప్యూటేషన్పై ఉన్న అధికారులను సొంతగూటికి పంపింది. ఇసుక ఆదాయానికి గండిపడకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులకు స్పష్టం చేసింది. గతంలో ఎండీగా సమర్థవంతంగా పనిచేసిన మల్సూర్కు తిరిగి బాధ్యతలు అప్పగించింది. మళ్లీ బాధ్యతలు తీసుకున్న నెల రోజుల వ్యవధిలోనే అక్రమ ఇసుక దోపిడీ వ్యవహారాన్ని మల్సూర్ బయటపెట్టారు.