నీళ్ల కష్టాలు రాకుండా ముందస్తు ప్లాన్

నీళ్ల కష్టాలు రాకుండా ముందస్తు ప్లాన్
  •     చౌటుప్పల్​ మండల మీటింగ్​లో నిర్ణయం  
  •     బెల్ట్ షాపు నడిపితే ఏపార్టీవారైనా  కఠిన చర్యలు  
     

చౌటుప్పల్ వెలుగు: వచ్చే  వేసవిలో  మంచినీటి ఎద్దడి తలెత్తకుండా   అధికారులు  ముందస్తుగానే ప్రణాళిక రూపొందించాలని  చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డి  సూచించారు.  సోమవారం  చౌటుప్పల్​  మండల సర్వసభ్య సమావేశం  జరిగింది.  గ్రామాల్లో మంచినీటి   పరిస్థితిఎలాఉందని ఆయన ఆరా తీశారు.  కొత్త బోర్లు, పాత బోర్లకు రిపేర్లకు సంబంధించి  ఎస్టిమేషన్లు   తయారు చేసి  అధికారులకు అందించాలని  పంచాయతీ సెక్రటరీలకు సూచించారు. 

మూసీకి దగ్గరగా ఉన్న గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా  మురికినీరు, కెమికల్ కలిసిన నీళ్లు వస్తున్నాయని కుంట్ల గూడెం, చిన్నకొండూరు,పెద్ద కొండూరు ఎంపీటీసీలు ఆరోపించారు.   గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు సరిగా   పనిచేయడంలేదని, వారికి గ్రామంపై పూర్తి అవగాహన ఉండటం లేదని ఎంపీపీ అన్నారు.   గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని,  వాటిని పూర్తిగా మూసివేసేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు.  

బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఏ పార్టీకి చెందినవారైనా  కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. షాపులు బంద్​ చేయకపోతే  బైండోవర్ చేసి,  కేసులు నమోదు చేయాలన్నారు.  నారాయణపురం, మునుగోడు మండలాల్లో బెల్ట్ షాపులు తగ్గినా .. చౌటుప్పల్ మండలంలో యథాతథంగా కొనసాగడం పట్ల  సీరియస్ అయ్యారు.   పెద్ద కొండూరులో బీఆర్ఎస్ లీడర్ల వద్ద సబ్సిడీ గొర్రెలు ఉన్నాయని,  అవి ఎక్కడ నుంచి వచ్చాయని ఆ గ్రామ ఎంపీటీసీ మెంబర్​వెటర్నరీ అధికారిని నిలదీశారు.  

ALSO READ : రూ. 125 కోట్లతో నల్గొండ మున్సిపల్ బడ్జెట్

సబ్సిడీ గొర్రెల పంపిణీలో  స్కామ్​  జరిగిందని,  అందులో భాగంగానే బీఆర్ఎస్ లీడర్ల వద్ద   గొర్రెలున్నాయని ఆరోపించారు. జడ్పీటీసీ  చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, ఎంపీడీవో, ఎమ్మార్వో, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.