బ్యాంకాక్: థాయ్ లాండ్లోని ఓ బాణసంచా గోడౌన్లో జరిగిన భారీ పేలుడు ధాటికి పదిమంది మృతిచెందారు. 118మంది ప్రజలు గాయపడ్డారని పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. సదరన్ థాయ్లాండ్లో ఈ ఘటన జరిగిందని, భారీ పేలుడుతో 200ఇండ్లు దెబ్బతిన్నాయని అధికారులు మీడియాకు వెల్లడించారు.
శిథిలాల్లో చిక్కుకుపోయినవారి కోసం రెస్క్యూటీమ్ చర్యలు వేగవంతం చేసిందన్నారు. సంఘటన ప్రాంతంలో ఉన్న భవనాలు, కార్లు, మోటార్ బైక్ లు దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. భవనాలు, ఇండ్ల గోడలు, పైకప్పులు కూలిపోయాయి. పేలుడు ప్రాంతంలో కుప్పలుగా పడిఉన్న శిథిలాల వీడియోను అధికారులు సోషల్మీడియాలో పోస్టు చేశారు. పేలుడు ప్రభావంతో చుట్టుపక్కల 500 మీటర్ల దూరంలోని నివాసాలు కూడా దెబ్బతిన్నాయని అధికారులు చెప్పారు.