
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం శనివారం (జూన్ 14) సాయంత్రం హైదరాబాద్లోని హైటెక్స్ ప్రాంగణంలో అట్టహాసంగా సాగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అవార్డులను అందజేశారు.
ఈ అవార్డుల ప్రదానోత్సవం 2024 ఉత్తమ నటుడి అవార్డు గ్రహీత అల్లు అర్జున్ హైలైట్ గా నిలిచారు.స్టేజీపైకి రాగానే సీఎం రేవంత్ రెడ్డిని అలింగనం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్.. సీఎంను రేవంతన్న అంటూ సంబోధించారు. ప్రతిష్టాత్మక అవార్డులు ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి థ్యాంక్స్ అంటూ అల్లు అర్జున్ స్పీచ్ ప్రారంభించారు.
స్టేజ్ పైన మాట్లాడిన అల్లు అర్జున్.. సీఎం రేవంత్ పర్మిషన్ తీసుకుని..పుష్ప స్టైల్లో తగ్గేదేలే డైలాగ్ చెప్పడం హైలెట్ గా మారింది. చివరలో పుష్ప 2 డైలాగ్ చెప్పారు. డైలాగ్ చెప్పేముందు సీఎం రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకోవడం..సీఎం రేవంత్ రెడ్డి..క్యారీ ఆన్ అన్నట్లు సిగ్నల్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.‘‘ ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా గుంట గంగమ్మ జాతరలో యాట తలలు నరికినట్లు రప్పా రప్పా నరుకుత ఒక్కొక్కర్నా.. పుష్పా.. పుష్పరాజ్..’’ అంటూ అల్లు అర్జున్ డైలాగ్ చెప్పడం ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేశారు.
హైదరాబాద్ లోని హైటెక్స్ లో తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్ వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ ,రాజకీయ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. 2024 పుష్ప 2కి బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ గద్దర్ అవార్డ్ అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నారు.